శ్రీకాకుళం టీడీపీ కంచుకోట - చంద్రబాబు అలా చేసారు : మంత్రి ధర్మాన..!!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పతాక స్థాయికి చేరింది. విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు స్వరం పెంచారు. ఉద్యమ కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే జేఏసీ ఏర్పాటు అయింది. ఈ నెల 15వ తేదీన విశాఖ కేంద్రంగా భారీ ర్యాలీకి నిర్ణయించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలంటూ మంత్రులు పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో ఉత్తరాంధ్ర మంత్రులు టీడీపీ - జనసేన లక్ష్యంగా రాజకీయంగా కార్నర్ చేస్తున్నారు. ఇప్పటికే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి..ఉద్యమంలోకి రావాలని ఉందంటూ వ్యాఖ్యానించిన మంత్రి ధర్మాన ప్రసాద రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు.
జగన్ ఎలా బాధ్యులవుతారు
ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందలేదంటే మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ఎలా బాధ్యులవుతారని ధర్మాన ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ఎందుకు ఏం చేయలేకపోయారని మంత్రి నిలదీసారు. వైఎస్సార్ సీఎం అయిన తరువాతనే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిందని చెప్పుకొచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తే టీడీపీకి వచ్చిన నష్టం ఏంటని ధర్మాన ప్రశ్నించారు. ఒక ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటంతోనే తమ ప్రాంతంలోని వారు పూర్తిగా బీదవారిగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు.
టీడీపీకి కంచుకోట - ఏం లాభం
2004 ఎన్నికల సమయం వరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోటగా ఉండేదని, వైఎస్సార్ ప్రత్యేక శ్రద్దతో పరిస్థితి మారిపోయిందని ధర్మాన వివరించారు. అసమానత కారణంగా ఉత్తరాంధ్ర లో ఉన్న సంస్దలు అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలవారివేనని ధర్మాన విశ్లేషించారు. తమ ప్రాంతపు వాసుల ఆవేదనతో గుండెలు మండుతాయంటూ వ్యాఖ్యానించారు.
పాలకులు అసమానతలు సరిదిద్దాలని..ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతోందన్నారు. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేసారు. తమ ప్రాంత వాసుల గొంతు విన్నప్పుడైనా గుర్తించాలని.. మా ఆవేదన అర్దం చేసుకోవాలని ధర్మాన సూచించారు.
చంద్రబాబు సమాధానం చెప్పాలి
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని పైన ఒక కమిటీ వేస్తే దానికి పోటీగా మరో కమిటీ వేసి నిర్ణయం ఎలా తీసుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. రాజ్యంగబద్దంగా నియమించిన కమిటీ నివేదికను వదిలేసారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలతో కమిటీ వేసి నిర్ణయాలు తీసుకుంటారా అని నిలదీసారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో సెంటర్ పాయింట్ ప్రాంతం అనేది సమస్య కాదన్నారు. హైదరాబాద్ ..చెన్నై ఆ రాష్ట్రాల్లో నడి మధ్యలో ఉన్నాయా అలోచించాలని సూచించారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా కాకుండా.. అన్ని ప్రాంతాల ప్రజలు పురోగతి సాధించేలా నిర్ణయాలకు సహకరించాలని మంత్రి ధర్మాన కోరారు.