దాని వెనుక చెప్తావా లేదా: ముద్రగడకు గంటా, మనవడికి దూరం: లోకేష్
విజయవాడ/తిరుపతి: దీక్ష విరమణ సమయంలో ఉద్వేగంగా మాట్లాడిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోటుదారుడు అని లేఖలో రాయడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. ముద్రగడ వివిధ నాయకులను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు.
ముద్రగడ వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో పదివేల ఓట్లు కూడా సంపాదించని ముద్రగడ పద్మనాభం తాను కాపుల ప్రతినిధిగా మాట్లాడటం విడ్డూరమన్నారు. మంజునాథన్ కమిషన్ను కలవని ముద్రగడ వివిధ పార్టీల నాయకులను ఎందుకు కలుస్తున్నారన్నారు.
ముద్రగడ ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. తుని ఘటన వెనుక ఎవరున్నారో ముద్రగడ చెప్పాలన్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నట్లుగా రాస్తున్న లేఖల వెనుక ఎవరున్నారో బయటపడాలన్నారు.
తునిలో జరిగిన రైలు దహనం, పోలీసు స్టేషన్ల ధ్వంసం ఘటనలకు ముద్రగడ బాధ్యత వహించాలని, లేదంటే బాధ్యులెవరో చెప్పారని గంటా హితవు పలికారు. కేవలం రాజకీయ ఉనికి చాటుకునేందుకు ఆయన రాద్దాంతం చేస్తున్నారన్నారు.
టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ... తుని ఘటన వెనుక ఎవరున్నారో విచారణలో ఇప్పుడు తేలుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం వివిధ కాంగ్రెస్ పార్టీ నేతలను కలవడం ఎందుకో చెప్పాలన్నారు. కాపులకు న్యాయం చేసేందుకు టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే కమిటీ వేశామని, అది పని చేస్తున్న సమయంలో, డెడ్ లైన్ పూర్తికాకముందే మళ్లీ డిమాండ్ చేయడం ఏమిటన్నారు.

మనవడిని చూసుకునే టైం లేదు: బాబుపై లోకేష్
తన మనవడిని కూడా చూసుకునే సమయం లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతున్నారని నారా లోకేష్ మహానాడు వేదికపై అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఆయన ఆదివారం ప్రసంగించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశామని, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామన్నారు. అలాగే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయిస్తున్నామన్నారు. విపక్షాల కుట్రలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications