జగన్కు గంటా సవాల్: ప్రత్యేక హోదాపై యనమల
హైదరాబాద్: హుధుద్ తుఫాను సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి భిమిలీ నుంచి పోటీ చేద్దామని ఆయన సవాల్ చేశారు.
భిమిలీ నుంచి కాకపోతే విశాఖపట్నం జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేద్దామని, ఆ రకంగా హుధుద్ తుఫాన్ సహాయక చర్యలపై ప్రజల తీర్పు కోరుదామని ఆయన అన్నారు. జ్యోతుల నెహ్రూను బలివశువును చేయవద్దని ఆయన జగన్కు సలహా ఇచ్చారు.
ఇదిలావుంటే, రాష్ట్ర రాజధానికి సంబంధించిన సీఆర్డిఎ బిల్లు సభలో ప్రవేశపెట్టామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం అసెంబ్లీలో తెలిపారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందాక గవర్నర్ దగ్గరకు వెళ్తుందని అన్నారు. గవర్నర్ ఆమోదం పొందాక భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.
భూసేకరణ సమయంలో భూములు ఇస్తున్నట్లు రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటామన్నారు. వీజీటీఎం పరిధిలోని ఆస్తులు, అప్పులు సీఆర్డిఎ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం వచ్చే ఏడాది మార్చిలోపు తెలిసిపోతుందని యనమల తెలిపారు.
కాంట్రాక్టు కార్మికుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా వారిని కాంట్రాక్టు సేవలకే పరిమితం చేయడం దారుణమని ఆయన మీడియాతో అన్నారు. అసెంబ్లీ విరామ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయబద్దమైన వేతనాల కోసం ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు.