ఆ మాట నేను అన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం:గంటా సవాల్;సోమూ వీర్రాజు సైలెంట్
Recommended Video
అమరావతి:టిడిపి,బిజెపి నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి పలు విషయాల్లో సవాల్, ప్రతి సవాళ్లకు దారితీస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ తో బిజెపికి సంబంధం విషయమై భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మరో విషయమై బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజుకు సవాల్ విసిరారు. జాతీయ విద్యా సంస్థలకు కేంద్రం పుష్కలంగా నిధులిస్తోందని తాను గతంలో అన్నట్లుగా సోమూ వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆయన ఈ ఛాలెంజ్ చేశారు. ఆ మాట తాను అన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సవాల్ విసిరారు. అయితే మంత్రి గంటా సవాల్ పై సోమూ వీర్రాజు స్పందించలేదు.
సోమవారం శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ-టీడీపీ కలిసి ఉన్నప్పుడు జరిగిన ఒక సభలో కేంద్రం విద్యాసంస్థల కోసం ధారాళంగా నిధులిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అయితే సోమూ వీర్రాజు వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు.
గడచిన నాలుగేళ్లలో తానెప్పుడూ అలా మాట్లాడలేదని...ఎక్కడ ఏ సభలో అలా అన్నానో గుర్తు చేసినా...నిరూపించినా...తాను ఏమి చేయటానికైనా సిద్ధమని మంత్రి గంటా ఛాలెంజ్ చేశారు. అయితే దీనిపై బిజెపి ఎమ్మెల్సీ ము వీర్రాజు ప్రతిస్పందించకుండా మౌనం వహించారు. అంతకుముందు సభలో సోమూ వీర్రాజు మాట్లాడుతూ వర్షం పడితే సచివాలయం, అసెంబ్లీ కారుతోందని... రాజధాని పేరుతో టిడిపి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
అయితే సోమూ వీర్రాజు విమర్శలను టిడిపి నేతలు తిప్పికొట్టారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి బీజేపీ సభ్యులు ఓర్వలేక పోతున్నారని... అభివృద్ధికి భాజపా సభ్యులు సైంధవుల్లా అడ్డం పడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై జరిగిన చర్చలో వివరణ ఇచ్చారు.