విశాఖ నుంచి పాలన - ముహూర్తం ఖరారు : ప్లాన్ "బీ" అమలు..!?
ఏపీలో పరిపాలనా రాజధానిగా విశాఖ కానుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో మూడు రాజధానుల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు తీర్పు అమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తీర్పు ఆలస్యం అయితే అమలు చేయాల్సిన ప్లాన్ బీ తో అధికార పార్టీ సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రభుత్వం మూడు రాజధానుల్లో కీలకమైన పరిపాలనా రాజధాని నుంచే పాలన చేయాలని దాదాపు నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పాలన ప్రారంభం పైన స్పష్టత ఇచ్చారు.

ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా
2019 డిసెంబర్ 18న శాసనసభా వేదికగా మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తరువాత కరోనా, కోర్టు వివాదాలతో ఇప్పటి వరకు మూడు రాజధానుల ప్రక్రియ అమలు కాలేదు. హైకోర్టు రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని తేల్చి చెప్పింది. అమరావతి రాజధానిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాల పైన సుప్రీం స్టే విధించింది. మూడు రాజధానుల అంశం పైన ఈ నెల 30న సుప్రీంలో విచారణ రానుంది. అటు న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటూనే..తమకు ఉన్న ప్రత్యామ్నాయాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

సుప్రీంలో కేసు.. కొత్త ప్రణాళికలు
విశాఖ కేంద్రంగా వచ్చే నెలలో కీలకమైన రెండు అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. అందులో ఒకటి పార్టనర్ షిప్ సమిట్ కాగా, రెండోది జీ 20 సన్నాహక సదస్సు. ఈ సదస్సు కోసం జాతీయ - అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అదే సమయంలో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక.. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 22న ఉగాది నుంచి సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలనకు సిద్దమవుతున్నారు. విశాఖ నుంచే సీఎం పాలన చేస్తుండటంతో మంత్రులు కూడా అక్కడ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. అయితే, సచివాలయం మార్పు కోర్టు తీర్పు మేరకు జరగాల్సి ఉంటుంది.

ముహూర్తం పై మంత్రి క్లారిటీ
ఇప్పుడు మంత్రి అమర్నాధ్ కీలక అంశాలను వెల్లడించారు. నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. ఉగాది పర్వదినానికి సరిగ్గా రెండు నెలల సమయమే ఉంది. కానీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం మూడు రాజధానులు సాధ్యం కాదని ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం మార్చే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు మూడు రాజధానుల తీర్పు ఆలస్యం అయినా.. విశాఖ నుంచే సీఎం జగన్ పాలన ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలొ మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విశాఖ నుంచి పాలన ప్రారంభించే అంశం పైన అధికారికంగా ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications