మంత్రి గారే ఒక "మెట్టు" దిగొచ్చారు:రాయదుర్గం టిడిపిలో రాజీ రాజకీయం
అనంతపురం: అనంతపురం జిల్లా టిడిపి ముఖచిత్రంలో అరుదైన దృశ్యం సాక్షాత్కరించింది. చాలా కాలంగా ఎడమొహం-పెడమొహంగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకే చోట కలసి చేతులు కలుపి నిలుచోవడమే కాకుండా ఏకంగా సెల్ఫీల మీద సెల్ఫీలు కూడా తీసుకున్నారంటే ఆశ్చర్యమే కదా మరి!
ఇంతకీ ఎవరా ఇద్దరు!...ఏమా కథ?...అనుకుంటున్నారా? అయితే ఇవిగోండి ఆ వివరాలు...ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కాల్వ శ్రీనివాసులు కాగా...మరొకరు మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి...రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల తమ రాజకీయ భవిష్యత్తు కోసమే ఏకమయ్యారట. ఇందుకోసం మంత్రి కాల్వ శ్రీనివాసులు...ఒక "మెట్టు" దిగి మరీ మెట్టు గోవిందరెడ్డితో చేతులు కలిపారట. వివరాల్లోకి వెళితే...
వాళ్లిద్దరు:ఎడమొహం...పెడమొహం
రాయదుర్గం ఎమ్మెల్యే, సమాచార,ప్రసార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు, మరో ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వీళ్లిద్దరూ ఆ తరువాత బాగా ఎడమొహం- పెడమొహంగా ఉండటం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అలాంటి ఈ నేతలు ఇద్దరు ఉరుము లేని తుఫాన్ లా ఉన్నట్టుండి మళ్లీ ఏకమవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఆ ఇద్దరినీ కలిపింది...ఈయనే
అయితే ఇటీవల జరిగిన టిడిపి మహానాడు వేదికగా అనంతపురం జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు ఈ ఇద్దరు నేతలను ఏకం చేసినట్లు తెలిసింది. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఇద్దరూ దగ్గరైతే రాజకీయంగా మరింత బలపడతారన్న ఉద్దేశంతో నాగరాజు వీరిని కలిపారట. ఈ మధ్య విజయవాడలో జరిగిన రాష్ట్ర మహానాడుకు గోవిందరెడ్డిని వెంటపడి మరీ తీసుకెళ్లారట. మంత్రి కాలవతో చేయి కలిపించారట. అలా కలిసిన వీళ్లు ఇలా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారట. మేము కలిసిపోయామోచ్...అని పార్టీ శ్రేణులకు ఎలుగెత్తి చాటేందుకే ఆ సెల్ఫీలట. ఈ విషయం తెలిసి ఆ ఫొటోలు చూసిన తెలుగు తమ్ముళ్లు కూడా చాలా సంతోష పడ్డారట.
కారణం...మంత్రి గారికే అవసరం
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తలెత్తుతుండటం...ముఖ్యంగా ఎంపి జెసి దివాకర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారుకావడంతో సొంత పార్టీ నుంచే ఆయనకి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయట. ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, ఎంపీ దివాకర్రెడ్డి ద్వారా గురునాథరెడ్డి రంగప్రవేశం చేయడం వంటి అంశాలు ఆయనకు మింగుడు పడటం లేదు. ప్రతిపక్షాల విమర్శలను, ఎత్తుగడలను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్న ఆయన సొంత పార్టీ నేతల వ్యూహాలకు దిగాలు పడుతున్నారట.
మెట్టు దిగి మరీ...మంత్రి గారి చొరవ
రాయదుర్గం అభివృద్ధి మంత్రాన్ని జపించే మంత్రి కాల్వ శ్రీనివాసులు తన రాజకీయ భవిష్యత్తు క్షేమం కోసం ప్రస్తుతం స్వపక్షంలో ముఖ్య నేతలను సంతృప్తిపరిచే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో తన పట్ల అసంతృప్తితో గుర్రుగా ఉన్న నేతలందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు. మెట్టు గోవిందరెడ్డిలాంటి సీనియర్ నేత తనతో ఉంటే తమ బలం మరింత పెరుగుతుందన్న భావన ఆయనలోనూ ఉందట. ఇప్పటికే నియోజకవర్గంలో ముల్లంగి నారాయణ సహా మరికొందరు నేతలు టీడీపీని వీడి వైసీపీతో జట్టు కట్టారు. ఈ పరిస్థితుల్లో తనపై గుర్రుగా ఉన్న మిగతా నేతలను బుజ్జగించే పనిలో ఉన్న కాల్వ ఆ క్రమంలో సాధించిన పురోగతే మెట్టు గోవిందరెడ్డితో రాజీ రాజకీయం అంటున్నారు స్థానిక టిడిపి నేతలు.ఈ విధంగా ఒక్కొక్కరిని దగ్గరకు తీసుకుంటూ తన బలం పెంచుకోవడం ద్వారా ఎన్నికల నాటికి స్థానిక నియోజకవర్గంపై తన పట్టు బాగా పెంచుకోవాలనేది మంత్రి కాల్వ వ్యూహంగా తెలుస్తోంది. మరి మంత్రి కాల్వ ఎత్తుగడలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాలి!