చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లో సీజన్ కో అవతారం; టీడీపీ బాధ అందుకే .. మంత్రి కన్నబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా టీడీపీ నేతలు వైసీపీ హయాంలో రైతులు సంతోషంగా లేరని, రోజుకో రైతు రోడ్డు ఎక్కుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతల వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టిడిపి నేతలపై ధ్వజమెత్తారు. టిడిపి నేతలు రైతుల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రైతుల హృదయాల్లో జగన్ .. తట్టుకోలేకనే టీడీపీ దుష్ప్రచారం
వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ప్రతి రైతు జీవితకాలం గుర్తుంచుకునేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తామని కురసాల కన్నబాబు చెప్పుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల హృదయాల్లో నిలిచిపోయారు అని, దానిని తట్టుకోలేక టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, నారా లోకేష్ తదితరులు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తున్నారని కన్నబాబు విమర్శించారు.

గంజాయి సాగు చేసే టీడీపీ నేతలే బాధపడుతున్నారు
రాష్ట్రంలో రైతులు అంతా బాగానే ఉన్నారని పేర్కొన్న కన్నబాబు, గంజాయి సాగు చేసే టీడీపీ నేతలే బాధపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో పది లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న మంత్రి కన్నబాబు వారి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు అయ్యన్నపాత్రుడు కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించినట్టు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో క్రాప్ హాలిడే .. చినరాజప్ప చేసిందిదే
తెలుగుదేశం పార్టీ హయాంలో అమలాపురం ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను నాడు హోంశాఖ మంత్రిగా ఉన్న చినరాజప్ప పోలీసులతో బెదిరించాడని కన్నబాబు గుర్తుచేశారు. అలాంటి టిడిపి నేతలు రైతుల క్రాప్ హాలిడే గురించి మాట్లాడటం ఏమిటి అంటూ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో గత మూడు నెలలుగా విస్తృతంగా దాడులు జరిపి గంజాయిని సాగు చేస్తున్న నిందితులను పట్టుకుంటున్నామని, టిడిపి నేతల గంజాయి దందా ఆగినందుకే తెగ బాధపడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించటంపై టీడీపీ అనవసరపు రాద్ధాంతం
ఇక వ్యవసాయ మోటారుకు మీటర్లు బిగించడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఎక్కడైనా అదనంగా రూపాయి ఛార్జ్ పడుతుందా అంటూ ప్రశ్నించిన కన్నబాబు తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను కన్నబాబు ఏకరువు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి భూములు అంటే అమరావతి భూములే అని, రైతులంటే అమరావతి రైతులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నబాబు.

రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతల ఏడుపు
తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు చేసిందేమీ లేదని, సీఎం జగన్ రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారికి ఏ కష్టం రానివ్వకుండా చూస్తున్నారని కన్నబాబు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సీజన్ కో అవతారమెత్తించి టిడిపి నేతలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కన్నబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పంటల సాగు బాగుందని, రైతులందరూ బాగున్నారని, రైతుల ఆనందం చూడలేక టిడిపి నేతలు బాధపడుతున్నారని కన్నబాబు ఆరోపించారు. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో కూడా రైతులు ఉత్పత్తి చేసిన పంటలను కొనుగోలు చేసి, ప్రభుత్వం రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.
Recommended Video

రైతుల సమస్యలపై టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రివర్స్ కౌంటర్
ఇటీవల సీఎం జగన్ పాలనలో న్యాయం చేయండి అంటూ రోజుకో రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై, వైసిపి సర్కారు తీరుపై తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రైతులను కాపాడడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా సీఎం జగన్ , వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలోనే మంత్రి కన్నబాబు వారి వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications