కేసీఆర్ దెబ్బ అలా ఉంటది: విశాఖ స్టీల్ ప్లాంట్పై మంత్రి కేటీఆర్, హరీష్ రావు
ఎంతోకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రం మాత్రం తాజాగా స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడంపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ నేపధ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడిన కారణంగానే కేంద్రం వెనక్కు తగ్గిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మెడలు వంచి భారత రాష్ట్ర సమితి తొలి విజయం సాధించిందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివచ్చిందని ఆయన పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం కాస్త వెనక్కి తగ్గిందని పేర్కొన్న మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ముందుకు వెళ్లేది లేదని కేంద్రమంత్రి ఫగ్గస్ సింగ్ వెల్లడించారని తెలిపారు. ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రకటించారన్నారు. ఆర్ ఐ ఎన్ ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారని ఇది హర్షించదగ్గ విషయం అన్నారు.
విశాఖ ఉక్కు పై గట్టిగా మాట్లాడిన ఘనత మన కేసీఆర్ దే అని, కెసిఆర్ దెబ్బ అలా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనను తెలుపుతున్నా స్పందించని కేంద్రం, ఇప్పుడు కేసీఆర్ పోరాటంతో స్పందించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

విశాఖ ఉక్కును అమ్మకూడదని కేసీఆర్ కొట్లాడారని, 27 వేల మంది కార్మికుల పక్షాన కేసీఆర్ నిలిచారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ దెబ్బకు కేంద్రం తగ్గిందని, ఇది బి ఆర్ ఎస్ విజయమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు నోరుమూసుకున్నాయని పేర్కొన్న మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications