"విజయానికి ఎంతో మంది తండ్రులు...":పోలవరంపై జగన్ విమర్శలను తిపికొట్టిన లోకేష్
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సినిమా చూపిస్తున్నారని...వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు తీసిందని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నత్తనడకన సాగుతున్నాయంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.
పోలవరం పనులు చంద్రబాబు చేతికి వచ్చాకే వేగంగా జరగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 55శాతం ప్రాజెక్టు పూర్తయిందన్నారు. వైసీపీ నేతలు సిగ్గలేకుండా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి కల అంటూ ఆయన పేరును తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన లోకేష్ ట్విట్టర్ లో జగన్ పై దండెత్తారు. ''ఇదంతా చూస్తుంటే విజయానికి ఎంతో మంది తండ్రులు...అపజయం అనాథ అన్నట్లు'' అన్నట్లుగా ఉందన్నారు.
జగన్ పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు తమ అధినేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. అమరావతి, పోలవరం పై నాలుగేళ్లుగా చంద్రబాబు రెండు అబద్ధాల సినిమాలు చూపిస్తున్నారని విమర్శించారు.
అమరావతి అనే ఒక సినిమా పేరుతో మూడు నెలలు, ఆరు నెలలకోసారి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ తరువాత అదిగో సింగపూర్, ఇదిగో ఎయిర్ బస్ అంటున్నారని, రెండో సినిమాగా పోలవరం చూపిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో కలెక్షన్లు రాబట్టడం కోసం వారానికోసారి రివ్యూ చేస్తారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందుకు సాగడం లేదని, ఇప్పటి వరకు ఆరేడు లక్షల క్యూబిక్ మీటర్లకు మించి పనులు జరగలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు తన కల అంటున్న చంద్రబాబు.. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిర్మించలేదని జగన్ ప్రశ్నించారు. వైఎస్ హయాంలోనే పోలవరం కాలువల పనులు పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఒక పునాది గోడ అని...పునాది గోడలను జాతికి అంకితం చేయడం చూస్తుంటే.. ఒక్క ఇళ్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసి...పునాది గోడలు కట్టగానే గృహప్రవేశం చేసినట్లుందని చంద్రబాబు తీరుని జగన్ ఎద్దేవా చేశారు.