2019నాటికి అదే లక్ష్యం.. ప్రతీ పదింటిలో ఐదు మనవే ఉండాలి: లోకేష్
అమరావతి: 2019 నాటికి దేశంలోని ప్రతీ 10 ఫోన్లలో 5 ఫోన్లు ఇక్కడే తయారుకావాలన్న లక్ష్యం పెట్టుకున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రేణిగుంటలోని శ్రీవెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్కు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీని కేరాఫ్గా చేయాలనుకున్న తమ లక్ష్యానికి కేంద్రం నిర్ణయం ఊతమిస్తుందన్నారు.
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వస్తున్న 10ఫోన్లలో రెండు ఏపీలోనే తయారవుతున్నాయన్నారు లోకేష్. 2019 నాటికి ప్రతీ 10 ఫోన్లలో 5 ఫోన్లు ఇక్కడే తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అనంతపురంలోను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2015లో రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కు చర్యలు తీసుకున్నారు. అదే ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.113.27 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మ్యానుఫాక్చరింగ్ హబ్ లో సెల్కాన్, కార్బన్, లావా కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి.
సెల్కాన్, డిక్సన్ ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించగా.. కార్బన్ కంపెనీ కూడా త్వరలోనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ హబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 50వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఉపాధికి లభించనుంది.