నారా లోకేష్కు కలిసొస్తుందా..!!
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అయిదు గ్యారంటీలపై సంతకాలు చేశారు.
మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే సచివాలయంలో అడుగు పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు.

ఈ మూడూ కీలకమైన శాఖలు కావడం వల్ల వాటిని పొందిన మంత్రులు ఆలస్యం చేయకుండా బాధ్యతలను స్వీకరించారు. సోమవారం చంద్రబాబు నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు సందర్శనలో నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు కూడా. ఈ ప్రాజెక్టు నిర్మాణం, ఇతర అంశాలపై ఆయన పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుంటోన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ త్వరలో ఛార్జ్ తీసుకోనున్నారు. వెలగపూడి సచివాలయం ఫోర్త్ ఫ్లోర్లో గల ఛాంబర్లో ఈ నెల 21వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఛాంబర్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు మంత్రివర్గంలో నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు లభించిన విషయం తెలిసిందే. ఐటీ మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2014- 2019 మధ్యకాలంలో కూడా ఆయన ఈ శాఖను పర్యవేక్షించారు.
మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు నారా లోకేష్. 91 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మురుగుడు లావణ్యను ఓడించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థి ఆయనే.












Click it and Unblock the Notifications