భారీ వర్షాలు, వరదల దెబ్బకు ఎన్ని ఇళ్లు, బైక్ లు దెబ్బ తిన్నాయో తెలుసా ?, డేటా
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం వరదల దెబ్బకి ఇంకా కోలుకోలేదు. విజయవాడ నగరంలోని పలు వార్డుల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడలోని మూడు డివిజన్లో పరిధిలో 10 వీధుల్లో ఇంకా వరద నీరు ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు.
విజయవాడలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ఇళ్లు పాడైనాయని మంత్రి నారాయణ వివరించారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు బీమా కంపెనీలు, బ్యాంకర్లతో వివిద అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.

విజయవాడ నగరంలో 33 వేల ఇళ్లు వరదల కారణంగా చాలా దెబ్బతిన్నాయని, 36వేల ద్విచక్ర వాహనాలు పాడైనాయని మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు. పాడైన ఇళ్లు, వాహనాలకు సంబంధించి శనివారం ఉదయానికి పూర్తి డేటా వస్తుందని మంత్రి నారాయణ అన్నారు. పూర్తి డేటా వచ్చాక దెబ్బతిన్న ఇళ్ళకు ఎంత ఇవ్వాలి, పాడైన ద్విచక్రవాహనాలకు ఎంత సహాయం చెయ్యాలి అని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత అధికారికంగా నష్టపరిహారం విషయంపై ప్రకటిస్తామని మంత్రి నారాయణ అన్నారు.
విజయవాడలోని వాణిజ్య దుకాణాలకు జరిగిన నష్టంపై శనివారం సాయంత్రానికి పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుతుందని మంత్రి నారాయణ వివరించారు. వరదల కారణంగా విజయవాడలో జరిగిన నష్టంపై అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని, వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.

వరదల కారణంగా దెబ్బ తిన్న ద్విచక్ర వాహనాలకు 100% బీమా కల్పిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయంలో చర్చలు జరపడానికి శుక్రవారం సీఎం చంద్రబు నాయుడు బ్యాంకర్లు, భీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. విజయవాడ నగరంలోని పలు డివిజన్లలో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఎంతెంత నష్టం జరిగిందనే విషయంపై పూర్తి డేటా సేకరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.












Click it and Unblock the Notifications