'ముద్రగడకు జగన్ తుపాకీ పెట్టి ఆటాడిస్తున్నాడు, వైసిపిలో చేరు, రాజ్యసభకు పంపుతాడు'
విజయవాడ: మంత్రి నారాయణ శుక్రవారం నాడు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన విరుచుకుపడ్డారు. ఆయన దీక్ష చేస్తానని చెప్పడం సరికాదన్నారు. ముద్రగడకు తుపాకీ గురి పెట్టి జగన్ ఆయనతో దీక్ష చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ముద్రగడ ఫిబ్రవరి 5న దీక్ష చేశారని, కొందరు రైళ్లు తగులబెట్టారని, ఇవన్నీ అయిపోయాయన్నారు. అయితే, తాము కాపులకు ఇచ్చిన హామీలు కట్టుబడి ఉన్నామని చెప్పినప్పటికీ ముద్రగడ మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరమన్నారు.
మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ.. సంవత్సరానికి రూ.1000 కోట్ల చొప్పున మొత్తం అయిదేళ్లకు రూ.5వేలకోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మొదటి ఏడాది తక్కువ ఇచ్చినప్పటికీ మొత్తానికి అయిదేళ్లలో రూ.5వేల కోట్లు ఇస్తారన్నారు.
అది జగన్ స్క్రిప్ట్
వైయస్ జగన్ స్క్రిప్ట్ను ముద్రగడ చదువుతున్నారని ఆరోపించారు. ముద్రగడ వ్యాఖ్యల వెనుక జగన్ హస్తం ఉందన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా 32వేల మందికి రూ.192 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. పచ్చ చొక్కాల వారికి రుణాలు ఇస్తున్నారని చెబుతున్నారని, అందరితో పాటు వారికి ఇవ్వవద్దా అన్నారు.
పచ్చ చొక్కాలకు ఇచ్చారని ముద్రగడ చెప్పడం వెనుక.. జగన్ హస్తం ఉందని చెప్పారు. నూరు శాతం కాపులు టిడిపికి ఓటు వేశారని చెబుతూనే... పచ్చ చొక్కాలకు రుణాలు అని చెప్పడం ఏమిటన్నారు. జగన్ స్క్రిప్ట్ చదవడం సరికాదని, లేదంటే వైసిపిలో చేరాలని సూచించారు.
తుపాకీ ఎక్కు పెట్టామా
అర్థవంతమైన విమర్శలు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. మేం తుపాకి పెట్టి పొలాలు తీసుకున్నామని చెప్పడంలో వైసిపి చెప్పడంలో అర్థం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని, దానిని డైవర్ట్ చేసేందుకే వైసిపి, సాక్షి పత్రిక రాజధాని భూదందా అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు.
ముద్రగడ... జగన్ మాయలో పడ్డారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని అభాండాలు వేయవద్దన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అని ముద్రగడ చెబుతున్నారని.. మీరేమైనా రౌడీయా అని ప్రశ్నించారు. చంద్రబాబును హెచ్చరించే స్థాయి మీకు ఉందా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతారా, జగన్ మాయలో పడకు
శాసన సభలో జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారని, మీరు కూడా అలాగే మాట్లాడుతారా అన్నారు. కొద్ది రోజుల క్రితం ముద్రగడ.. చంద్రబాబును పొగిడారని, ఇప్పుడేమో విమర్శిస్తున్నారన్నారు. ఇదేం పద్ధతి అన్నారు. తాము ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
మీరు పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని చంద్రబాబును హెచ్చరిస్తారా అని ముద్రగడపై భగ్గుమన్నారు. చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. జగన్తో కలిసి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ మాయలో ముద్రగడ పడవద్దన్నారు.
జగన్ మీతో ఆటాడిస్తున్నారు, పచ్చ చొక్కాలకు ఇవ్వొద్దా
మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు అని, మీకు అన్నీ తెలుసునని, కానీ జగన్ మీతో ఆట ఆడిస్తున్నారన్నారు. మీరు జగన్ మాయలో, జగన్ ట్రాప్లో ఉన్నారని అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. మీరు కావాలంటే జగన్ పార్టీలో చేరవచ్చునని చెప్పారు.
మీరు చేసే తీరు కాపులకు మచ్చ అన్నారు. కాపులంతా వాళ్లంతా టిడిపికి ఓటేశారని మీరే అంటారు... మళ్లీ పచ్చ చొక్కాలకు రుణాలు ఇచ్చారని, మీరే చెబుతారు. అంటే తమకు మద్దతు పలికిన పచ్చ చొక్కాల (కాపులు) వారికి రుణాలు ఇవ్వవద్దా ముద్రగడ చెప్పాలన్నారు. ఇదేం లాజిక్ అన్నారు.
క్షమాపణ కోరుతున్నా
నేను ఏదైనా తప్పు మాట్లాడినట్లుగా కాపులు భావిస్తే తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. కానీ నేను ఎలాంటి తప్పు మాట్లాడలేదని భావిస్తున్నానని చెప్పారు. రాజధాని కోసం నేను, మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇతరులు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసునన్నారు.
మేం ఇంత చేస్తే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అన్నారు. కాపులను ముద్రగడ అవమానిస్తున్నారన్నారు. నేను కాపు వర్గానికి చెందిన వాడినని, ముద్రగడ అధే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని.. నన్ను ఎలా విమర్శిస్తారన్నారు. అధ్యయనం చేసి రాజధాని నిర్మాణం చేస్తున్నామన్నారు.
రాజ్యసభ ఇస్తారని చదివా.. మంత్రి కానివ్వండి
నేను కాపును అని.. తమకు రాజధాని బాధ్యతలు ఇచ్చారన్నారు. ఓ కాపు నేతను అయిన తనకు మంచి పేరు వస్తుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారన్నారు. జగన్.. ముద్రగడను రాజ్యసభకు పంపిస్తారని చదివానని, అది ఆయన ఇష్టమని, చెప్పారు. ముద్రగడ మాటలు రౌడీల్లా ఉన్నాయన్నారు. జగన్ మీపై తుపాకి పెట్టి మాట్లాడిస్తున్నారన్నారు.