'అనంత' ప్రమాదం: పరిటాల సునీత, పల్లె దిగ్భ్రాంతి
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద జరిగిన బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిందని ఏపీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బెంగళూరు, పుట్టపర్తికి, స్వల్ప గాయాలైన వారిక హిందూపురంలో చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు పరిటాల సునీత, శిద్దారాఘవ, తాను ఘటనా స్థలికి బయలుదేరుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారని, వెంటకే సహాయక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను చంద్రబాబు ప్రకటించారని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా పెనుగొండ బస్సు ప్రమాద ఘటన చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎక్కువగా పాఠశాల విద్యార్థులు చనిపోవడం ఆవేదన కల్గిస్తోందన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని హిందూపురం, పెనుగొండ ఆస్పత్రులకు తరలించి చికిత్స పొందుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించినట్లు మంత్రి పరిటాల సునీత చెప్పారు.
సంఘటనా స్థలానికి జడ్పీ చైర్మన్ చమన్ సాబ్, పెనుకొండ శాసనసభ్యుడు పార్థసారథి, ధర్మవరం శాసనసభ్యుడు సూర్యనారాయణ, మడకశిర శాసనసనభ్యుడదు ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పే స్వామి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం పది వేల రూపాయలేసి అందించారు.