పవన్ కళ్యాణ్ మా పార్టీకి మిత్రుడు: 'హోదా కోసం పోరాడితే మంచిదే'
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతిలో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నూతనంగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో వ్యవసాయశాఖ ఆఫీసుని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ టీడీపీకి మిత్రుడని ఆయన అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేకహోదాని పవన్ సహా ఎవరు కోరినా మంచిదేనని ఆయన చెప్పారు. హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతికూలంగా స్పందిస్తే, దానిపై సరైన సమయంలో నిర్ణయంతీసుకుని ముందుకెళతామని ఆయన అన్నారు. ఏపీకి హోదా సాధించే వరకూ ఉద్యం చేస్తామని ఆయన అన్నారు.

ఏపీలో వ్యవసాయ అనుంబంధ రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పాటు పడుతుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవని ప్రాంతాల్లో 50 శాతం రాయితీపై రెయిన్గన్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంపై తిరుపతిలో వచ్చేనెల 11 నుంచి 15 వరకు సదస్సులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొనుగోలు చేసిన ఉల్లిని అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ఉల్లి మార్కెట్లో దళారీల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నాలుగో బ్లాకు కింది అంతస్తులో వ్యవసాయశాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications