మంత్రి పెద్దిరెడ్డి - ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం: వాహనం పల్టీ..!!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వాహనంలో తండ్రితో పాటుగా ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారు. కాన్వాయ్ లోని ఎంపీ మిథున్ రెడ్డి కి చెందిన వాహనాన్ని ఎదురుగా వచ్చిన వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
దీంతో, ఎంపీ వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తిగత కార్యదర్శి , భద్రతా సిబ్బంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఎవరికీ ఏమీ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగే సమయంలో మంత్రి - ఎంపీతో పాటుగా కటుుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు అక్కడకు చేరుకున్నారు. మరో కారులో మంత్రితో సహా కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు ఎవరికీ ప్రమాదం జరగలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తుతం చిత్తూరు - అనంతపురం పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కోసం నారావారిపల్లెకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వీటి పైన మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. కుప్పంలో ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేసారు. అదే సమయంలో మంత్రి నియోజకవర్గం పుంగనూరు పైన చంద్రబాబు ఇదే తరహాలో ఛాలెంజ్ చేసారు. అటు ఎంపీ మిథున్ రెడ్డికి కీలకమైన గోదావరి జిల్లాల బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ సభ్యులో కలిసి జరుపుకుంటున్నారు.