వైయస్ జగన్ నిజంగానే జైలుకెళ్తారా?: టీడీపీ నేతల కొత్త పల్లవి
విజయవాడ: ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్ను మానసికంగా దెబ్బతీసేందుకు తెలుగుదేశం కొత్త వ్యూహాన్ని అవలంభిస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్నటి వరకు ఆపరేషన్ ఆకర్ష్తో వైసీపీ అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేసింది తెలుగు దేశం పార్టీ.
ఆక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ జైలుకు వెళతారంటూ అధికార టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం మార్టేరులో కారెం మోహన్రావు వర్ధంతి సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సుజాత ప్రారంభించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పిన పీతల, జగన్ పార్టీ వైసీపీ కూడా త్వరలోనే ఖాళీ కానుందని జోస్యం చెప్పారు. ఆదివారం నెల్లూరు వేదికగా టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి సైతం వైయస్ జగన్తో పాటు వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ను ఉద్దేశించి ఆనం మాట్లాడుతూ 'మగతనం, రోషం లేక వైసీపీ అధినేత జగన్ జబర్దస్త్ రోజాను టీడీపీపైకి వదిలారు' అంటూ ఆనం వ్యాఖ్యానించారు. ఫేస్ వ్యాల్యూ గురించి రోజా మాట్లాడుతున్నారని, జగన్ కు ఫేస్ వ్యాల్యూ లేనందునే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టీడీపీలోకి వచ్చారని కూడా ఆనం అన్నారు.
'రోజాకు మేకప్ లు... వైసీపీకి పేకప్ లు.... జగన్కు లాకప్ లు తప్పవు' అని ఆయన అన్నారు. 'గతంలో సినిమాల్లో రాణించావు. ఇప్పుడు సినిమాలు లేవు. టీవీలకే పరిమితమయ్యావు. రాబోయే రోజుల్లో జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్స్ లకే పరిమితమవుతావ్' అని అన్నారు.
అంతటితో ఆగకుండా 'వైసీపీ పతనానికి నీ ఒక్క పాదమే చాలమ్మా రోజమ్మా' అంటూ వ్యంగంగా అన్నారు. 'లేడీబాస్ లాగా టీడీపీ నేతలపైకి రోజా వస్తున్నారు. రాజకీయాల్లో వెకిలి చేష్టలు సరికాదమ్మా... రోజమ్మా' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఆదివారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మావాడిని పార్లమెంటు గేటు వద్ద కలిశానని వైయస్ జగన్ని ఉద్దేశించి చెప్పారు. మావాడితో రాజకీయాలు ఏం మాట్లాడలేదని, బాగున్నావా అంటే బాగున్నావా అని పలకరించుకున్నామన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆ తర్వాత ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు.
రాహుల్ గాంధీ.. జగన్ గురించి మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ భావాలు జగన్ పైన సదాభిప్రాయం ఉన్నట్టు కనపడలేదన్నారు. అలాగే జగన్కు శిక్ష తప్పదని కూడా ఆయన చెప్పారని జేసీ వ్యాఖ్యానించారు వైసిపి నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యేలు ప్రవాహంలా వస్తారని, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో టచ్లో ఉన్నారన్నారు. త్వరలోనే వైసిపి ఖాళీ అవుతుందన్నారు.