వైసీపీలో నరసాపురం చిచ్చు-సుబ్బారాయుడిపై పేర్ని ఫైర్-చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలని సెటైర్లు
వైసీపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా విభజనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న భీమవరం జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ఎంపిక చేయకపోవడంపై స్ధానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును టార్గెట్ చేశారు. ఆయన్ను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకున్నారు. దీనిపై ఇవాళ స్పందించిన మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు.
వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేని గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం లాంటి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవులు ఎన్నో చేసి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిలా మాట్లాడి, ఆయన విలువని ఆయనే తగ్గించుకున్నారని పేర్ని వ్యాఖ్యానించారు.

Recommended Video

నరసాపురానికి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించిందని దానికీ, నరసాపురం ఎమ్మెల్యేకు ఏం సంబంధమని మంత్రి పేర్ని ప్రశ్నించారు. భీమవరం అనేది నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందని, దాన్ని ఎంపిక చేశామన్నారు. తద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ నేత ఎలా ప్రశ్నిస్తారంటూ పేర్ని మండిపడ్డారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని పేర్ని విమర్శించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని పేర్ని ఆరోపించారు. మనకు నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలనుకుంటే ఆయన చాలా సార్లు కొట్టుకోవాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications