RTC సమ్మె వెనుక, మహాలక్ష్మీ పథకం పైనే..!!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ సంఘాలు సమ్మె విరమణ చేయాలని కోరింది. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్క రించడానికి సిద్ధంగా ఉందని.. మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే సమ్మెకు వెళ్లటం వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సామాన్యులకు సమస్యగా మారుతోంది. బస్సులు డిపోలకే పరిమితం కావటంతో.. ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదు. అవన్నీ వెంటనే పరిష్కారమయ్యే అంశాలు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండూ పెండింగ్లో ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంది. అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగాం. ఈ రెండు అంశాలూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామని నలుగురు అధికారుల కమిటీకి తెలియచేసామని మంత్రి వివరించారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనా ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ ఆగ్రహం
ఆర్టీసీ అనేది రాష్ట్రంలోని పేద ప్రజలకు లైఫ్ లైన్.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకూ 65 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.. అందులో 40లక్షల మంది మహిళలు ఉద్యోగ రీత్యా, విద్యా, వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారని మంత్రి వివరించారు. ఈ సమస్యపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినప్పటికీ అధికారుల కమిటీతో ఐదు గంటలపైగా చర్చిస్తుండ గానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం కుట్రలా ఉందన్నారు మంత్రి పొన్నం. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మీ ప్రయాణంపై కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని.. వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ అధ్యక్షుడుగా ఉన్న హరీష్ రావు సమ్మె విషయంలో కార్మికులను ప్రోత్సహించారని ఆరోపించారు. మహాలక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారన్నారు. ఉద్యోగులపై పనిభారం పడకుండా ఉండడానికి 4,538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.













Click it and Unblock the Notifications