పెద్దిరెడ్డిని దెబ్బకొట్టిన చంద్రబాబు, రంగంలోకి దిగుతున్న ఆ మంత్రి, ఫేస్ టూ ఫేస్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టడానికి సిద్దం అయ్యారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గంలోని ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇదే సందర్బంలో చేపట్టనున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డితో పాటు పలువురు టీడీపీ బృందంతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.

టీడీపీ శ్రేణుల క్షేత్రస్థాయి పర్యటనలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నామని, త్వరలో ఆయన భాగోతం మొత్తం ప్రజల ముందు పెడుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
ఇటీవల మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో 22ఏ సెక్షన్ భూముల రికార్డులు అగ్నికి ఆహుతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని భయంతో వైసీపీ నాయకులు, కొందరు రెవెన్యూ అధికారులు కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను కాల్చివేశారని జోరుగా ప్రచారం సాగింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబం అక్రమాలు, అరాచకాలు పాల్పడిందని, వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు చెలరేగిపోయారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు. అయితే ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లి డివిజన్లోని 11 మండలాల తహసీల్దార్లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications