ఆ పార్టీలో ఆడవాళ్లు తొడ గొడతారు - మగవాళ్లు ఏడుస్తారు : మంత్రి రోజా..!!
ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే - సినీ నటుడు బామలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో వరుసగా ఏపీ మంత్రులు కౌంటర్ చేస్తున్నారు. పలువురు మంత్రులు బాలయ్య ను టార్గెట్ చేస్తూ..నాడు వైశ్రాయ్ హోటల్ ఘటన సమయంలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని ఖండించింది. టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు.
టీడీపీని టార్గెట్ చేస్తూ మంత్రి రోజా
జూనియర్ ఎన్టీఆర్ స్పందనలో భాగంగా ఎన్టీఆర్ - వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలుగా పేర్కొన్నారు. పేరు తొలిగించినంత మాత్రాన ఎన్టీఆర్ ఇమేజ్ తగ్గదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మంత్రి రోజా ఇప్పటికే బాలయ్యకు హెచ్చరిక చేసారు. చంద్రబాబు ముందు ఫ్లూటు ఊదాలని, జగనన్న ముందు కాదంటూ ట్వీట్ చేసారు. తేడా వస్తే దబిడి దిబిడేనంటూ హెచ్చరించారు. దీనికి కొనసాగింపుగా బాలయ్యా..మీ నాన్నను దూరం చేసిన వారి పైన ప్రతీకారం తీర్చుకో అంటూ రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.
కుప్పంలో చంద్రబాబుకు నో ఛాన్స్
ఇప్పుడు మంత్రి రోజా ఇదే అంశం పైన మరోసారి స్పందించారు. నందమూరి కుటుంబానికి సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసారు, టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారని.. మగాళ్లు ఏడుస్తారంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గేది లేదు..జగన్ తగ్గేది లేదంటూ రోజా పంచ్ డైలాగులు చెప్పారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయంగా రోజా పేర్కొన్నారు.
వాకీటాకీలు - ఐ ఫోన్లతో రైతులా
పాదయాత్ర పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రైతులు ఎక్కడైనా వాకీటాకీలు పెట్టుకొని ఐ ఫోన్లతో మాట్లాడటం ఎక్కడైనా చూసారా అని ప్రశ్నించారు. రైతులు అక్కడే కాదని, రాయలసీమలో ఉంటారని.. ప్రతీ చోటా ఉంటారని చెప్పారు. 28 గ్రామాల కోసం 26 జిల్లాలకు నష్టం జరగకూడదనే..అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలనే లక్ష్యంతోనే వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని మంత్రి రోజా వివరించారు.
ఇప్పటికే వర్సిటీ పేరు మార్పుకు సంబంధించి అసెంబ్లలో బిల్లు పాసయింది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజా చేసిన విమర్శల పైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.