మంత్రి రోజాకు అక్కడ అవమానం.. కన్నీటి పర్యంతం..!!
అమరావతి: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాను పిలిచి అవమానించారా? దసరా వైభవం పేరుతో ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో దీన్ని స్పష్టం చేస్తోంది. నన్ను పిలిచింది అవమానించడానికా.. అంటూ రోజా స్టేజీ దిగి వెళ్లిపోవడం ఈ ప్రోమోలో కనిపించింది.
దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి రోజా హాజరయ్యారు. దసరా వైభవం పేరుతో విజయదశమి నాడు అంటే అక్టోబర్ 5వ తేదీన ఇది ప్రసారం కానుంది. పండగ రోజున ప్రేక్షకులను ఆలరించడానికి రూపొందించిన స్పెషల్ ఎపిసోడ్ ఇది. రోజాతో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ, హాస్యనటుడు కృష్ణ భగవాన్ గెస్ట్గా హాజరయ్యారు. శ్రీముఖి యాంకర్గా వ్యవహరించారు.
హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ప్రసాద్ సహా టీవీ సీరియళ్లల్లో నటించే పలువురు నటీనటులు ఈ ఎపిసోడ్లో దర్శనం ఇచ్చారు. ప్రారంభంలో సరదాగా సాగినప్పటికీ- చివర్లో తేడా కొట్టినట్టే కనిపించింది. హైపర్ ఆది.. రోజాకు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏ శాఖలు ఎవరికి ఇస్తే బాగుంటుందో చెప్పాలని కోరారు. శ్రీముఖి ఈ మధ్య అన్ని ఛానళ్లల్లో కనిపిస్తోన్నందున ఆమెకు పర్యాటక శాఖ, తినడంపై ధ్యాస ఉన్నందున హైపర్ ఆదికి ఆహార భద్రత శాఖ సెట్ అవుతాయని రోజా సమాధానం ఇచ్చారు.
చివర్లో వాళ్లు ఇబ్బందికర ప్రశ్నలు అడిగినట్లు కనిపించింది. ఆ ప్రశ్నలేమిటనేది ఈ ప్రోమోలో లేవు గానీ- అవి రోజాకు మాత్ర తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఏం మాట్లాడుతున్నావ్.. అంటూ హైపర్ ఆది, శ్రీముఖితో పాటు పక్కనున్న వారి మీద రోజా అసహనం వ్యక్తం చేశారు. అసలు నన్ను పిలిచింది అవమానించడానికా.. అని నిలదీశారు. తన మెడలో ఉన్న దండను తీసి పక్కన పడేశారు. అందరూ ప్లాన్ చేసుకుని నన్ను రమ్మన్నారా?.. అని స్టేజీ దిగి వెళ్లడం ఈ ప్రోమోలో కనిపించింది.