జగన్ ఇప్పటి వరకు సైలెంట్ - ఇక మొదలు : మంత్రి రోజా..!!
చంద్రబాబు ఇరుకు రోడ్డులో సభలు పెట్టినా జనాన్ని చంపేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.చంద్రబాబు వల్ల అమాయకులు పోతున్నా పవన్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీసారు. తండ్రి ఫొటో లేకుండా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్రను ఆపాల్సిన అవసరం తమకు లేదన్నారు. పవన్ ప్యాకేజీకి తప్ప..పాలిటిక్స్కు పనికి రాడని స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని..చర్యలు తప్పవని హెచ్చరించారు.

పవన్ వెంట పడుతున్న చంద్రబాబు
పేదవారి ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్క లేదని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చంద్రబాబు 40 మందిని చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు తన పుత్రుడు కంటే దత్తపుత్రుడు మేలు అనుకుంటున్నారన్నారు. అందుకే లోకేష్కు కోపం వచ్చి పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేసారు. లోకేష్ పాదయాత్రకు ముందే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. లోకేష్ను ప్రజలు అసలు ఊర్లలోకి రాణించలేరని అర్థమవుతోందని రోజా చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్రతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఆ పార్టీకే నష్టమరి రోజా చెప్పుకొచ్చారు.

జగన్ ఇచ్చిన ప్రతీ హామీ అమలు..
ముఖ్యమంత్రి జగన్ తానిచ్చిన ప్రతి వాగ్ధానాన్ని 98 శాతం అమలు చేసారని రోజా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో, పాదయాత్రలో వైయస్ జగన్ ఇచ్చిన హమీలు నెరవేర్చారన్నారు. ఒక సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి సంక్షేమ పథకాలను టైం ప్రకారం అందిస్తున్నారని వివరించారు. వైయస్ జగన్ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా కేవలం లక్ష 30 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నారన్నారు. వైయస్ జగన్ ప్రతి సంక్షేమానికి డీబీటీ ద్వారా లక్ష 85 వేల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించారని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా లక్ష 45 వేల కోట్లను ఇచ్చి దాదాపుగా మూడున్నరేళ్ల పాలనలో దాదాపుగా రూ.3.30 లక్షల కోట్లు సంక్షేమానికి ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు.

అమరావతి రైతులు మాయం అయ్యారు
పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి ఉద్యమాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసారని రోజా వ్యాఖ్యానించారు. హైకోర్టు వాళ్లను ఐడీకార్డులతో పాదయాత్ర చేయమనగానే వారంతా మాయం అయ్యారని వ్యాఖ్యానించారు. అది రియల్ పాదయాత్ర కాదన్నారు. చంద్రబాబు తన బినామీల కోసం పెయిడ్ ఆర్టిస్టులతో యాత్ర చేయించారని అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఇదేం ఖర్మరా బాబూ అనే కార్యక్రమాన్ని గమనిస్తే ..ప్రజలంతా చంద్రబాబును చూసి ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్, లోకేష్లు పనికిమాలిన రాజకీయాలు, విషం చిమ్మే రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇంతవరకు వైయస్ జగన్ సైలెంట్గానే ఉన్నారన్నారు. కానీ మనుషుల ప్రాణాలు తీసిన తరువాత ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కచ్చితంగా గుంటూరు ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ మరణాలకు కారకులైన అందరికి కూడా కఠిన శిక్షలు పడేంత వరకు మేం వదలమని మంత్రి రోజా స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications