బాలయ్య.. పవన్ లాగా కాదు : మంత్రి రోజా సంచలన కామెంట్స్..!!
ప్రముఖ హీరో.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా బాలకృష్ణ చంద్రగిరిలో తన సినిమా లో డైలాగులను వివరిస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. దీని పైన మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ గతప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా మరిజెన్సీలో లాగా ఉందనే అనుకుంటున్నారన రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని రోజా సూచించారు.
స్క్రిప్టులు రాసి ఇచ్చినా మాట్లాడలేని పరిస్దితి
అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాలలో మంత్రి రోజా పాల్గొన్నారు. తాను ప్రతీ ఏటా ఇక్కడే సంక్రాంతి జరుపుకుంటానని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తి చేసారు. బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడంలేదన్నారు.బాలకృష్ణ ది స్క్రిప్టులు రాసి ఇచ్చినా మాట్లాడలేని పరిస్దితి అని ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాల్గొన్న సభల్లో 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ను బాలకృష్ణ, పవన్ కల్యాణ్ పూర్తిగా చదివారా అని మంత్రి రోజా నిలదీసారు.
బావ కళ్లల్లో ఆనందం కోసం
ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అటనం హాస్యాస్పదమన్నారు. జీవో నంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. తన అల్లుడు , కూతురు బాగుండాలని తన బావ మెప్పుకోసం ఇలా మాట్లాడి ఉండొచ్చని రోజా పేర్కొన్నారు. అన్ స్టాపబుల్ల లో ఎన్టిఆర్ పై జరిగిన చర్చ పై ప్రజలందరూ ముందుగానే సిద్దమైన స్క్రిప్టుగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపారని విమర్శించారు. ఎవరు చచ్చినా పరవాలేదు .. నా బావ మీటింగ్ జరగాలి ... నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు బాలయ్యకు తెలియదా అని నిలదీసారు.
పవన్ లాగా కాదు. బాలయ్యకు తెలుసు
ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా అంటూ ఫైర్ అయ్యారు. బాలయ్య హిందూపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసారు. పవన్ లాగా ఓడిపోలేదని.. బాలయ్యకు ప్రజల కష్టాలు తెలుసని చెప్పుకొచ్చారు. మూడుపంటలు పండే భూమిని ఎవరో స్వామీజి చెప్పారని బీడు భూమి చేశారని ఫైర్ అయ్యారు. సినిమాలో ఎన్ని డైలాగులు చప్పినా చప్పట్లు కొట్చుకోవడానికే తప్ప ప్రజల ఊళ్ళు బాగుపడవని రోజా వ్యాఖ్యానించారు.