అన్నీ ముందే చెప్పి చేయలేం - ముందస్తు ఎన్నికలపై బొత్సా క్లారిటీ..!!
ఏపీ సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ ముందస్తు ఎన్నికలపైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో టీడీపీ -జనసేన కలుస్తాయని తాము ముందు నుంచి చెబుతూ వచ్చామని గుర్తు చేసారు. ఇప్పుడు అదే జరిగిందని వ్యాఖ్యానించారు. వైసీపీ కాపు నేతల సమావేశంలో తాము పవన్ గురించే చర్చించామనేది సరి కాదన్నారు. కాపులకు తమ ప్రభుత్వంలో ఏం చేశామనేది చెప్పేందుకే తాము రాజమండ్రిలో సమావేశం నిర్వహించామని వివరించారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణిని ప్రభుత్వం అపలేదని స్పష్టం చేసారు.
పవన్ కావాలనుకుంటే పొరుగు రాష్ట్రంలో కూడా పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. సెలబ్రెటి కాబట్టి ముందస్తు సమచారాం కోరామని వివరించారు. తాను బయటకి వెళ్లినప్పుడు కొందరు చూసే వారు ఉంటారని, పవన్ కళ్యాణ్ ను 200 మందో, 2 వేల మందో చూస్తారని బొత్సా చెప్పుకొచ్చారు. ఏ సెలబ్రెటీని అయినా అలాగే చూస్తారని చెప్పుకొచ్చారు. ఇక, ఏపీలో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదన్నారు. చివరి వరకూ అధికారంలో ఉంటామని స్పష్టం చేసారు. మరో సారి గెలిచి అయిదేళ్లు అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేసారు.
పాలనా పరంగా ప్రతి విధాన నిర్ణయానికీ ప్రజాభిప్రాయం తీసుకోవడం సాధ్యం కాదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు పునరాలోచన ఉండే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ అర్ధరాత్రి నోట్లు రద్దు చేశారని.. దేశ ప్రజలందరికీ ముందే చెప్పి చేయలేదు కదా అని ప్రశ్నించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం కూడా సంస్కరణలు తీసుకొస్తోందన్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని సంస్కరణలు చేస్తున్నామని వివరించారు. టీడీపీ ప్రభుత్వం 2,900 పాఠశాలలను పూర్తిగా మూసివేసిందని, తాము ఒక్కటి కూడా మూసేయలేదన్నారు.
తమ విధానాలు బాగున్నందునే ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల అభ్యంతరాలతో 891 పాఠశాలల్లో విలీనం నిలిపివేశామని, చివరకు 4,943 పాఠశాలల్లో పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. తాజాగా రాజమండ్రి వేదికగా సమావేశమైన వైసీపీ కాపు నేతలు త్వరలో మరింతగా పార్టీలోని కాపు నేతలందరినీ ఆహ్వానించి విజయవాడలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.