చంద్రబాబుకు మునిశాపం, నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలు, అందుకే ఇలా : మంత్రి వెల్లంపల్లి ధ్వజం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిడిపి నాయకులను కావాలని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని,జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అబద్ధాలు చెప్పటానికి కారణం ఇదే : వెల్లంపల్లి
చంద్రబాబు నాయుడుకు త్వరలో చిప్పకూడు ఖాయమని వైసీపీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని పేర్కొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు ముని శాపం ఉందని,నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందని, అందుకే చంద్రబాబు నిత్యం అబద్ధాలే మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్.గతంలో టిడిపి హయాంలో, ప్రభుత్వంలో పెత్తనం చేసిన నాయకులు అందరూ దొంగలే అయినా దొరల్లా తిరిగారన్నారు.
అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు టిడిపి నాయకులు
చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు,దేవినేని ఉమాలకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబునాయుడు హెరిటేజ్ కోసం రాష్ట్రంలో ఉన్న పాల డెయిరీలన్నింటినీ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. ధూళిపాళ నరేంద్ర అరెస్టుపై మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ సంగం డెయిరీ ఎవడబ్బ సొత్తు అని ధూళిపాళ తన జేబు సంస్థగా మార్చుకున్నాడు అంటూ నిప్పులు చెరిగారు.అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు గత టిడిపి నాయకులని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీలో నాయకులు దోచుకున్న సొమ్ము, ప్రజలకు అప్పగించడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
వెల్లంపల్లి తరహాలో గతంలోనే చంద్రబాబుకు మహాముని శాపం ఉందన్న విజయసాయిరెడ్డి
ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు, గతంలో ఓ మారు టీడీపీ అధినేత చంద్రబాబు, నాడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగుతున్న సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా చేశారు.సోషల్ మీడియా వేదికగానాడు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు మహాముని శాపం ఉంది. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ఓ మునీశ్వరుడు శపించాడు.అందుకే ఆయన అసత్యాలు తప్ప నిజం జన్మలో చెప్పరని విజయ సాయి రెడ్డి విమర్శించారు. తాజాగా మరోమారు వైసిపి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుపై ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.