దేశ చరిత్రలోనే వైద్యారోగ్య రంగంలో గొప్ప మైలురాయిగా ఫ్యామిలీ డాక్టర్: మంత్రి విడదల రజిని!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం మన దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్య రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలవబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధంచిన నూతన 104 మొబైల్ మెడికల్ వాహనాలను చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి విడద రజిని ప్రారంభించారు.
అనంతరం చిలకలూరిపేట పట్టణంలో నిర్మాణం పూర్తి అయిన 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ను మంత్రి విడదల రజని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్ పై ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 260 నూతన 104 వైద్య వాహనాలు ప్రారంభించినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 104 వైద్య సర్వీసులు 676 పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆమె వాటికి అదనంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం కొత్తగా మరో 260 వాహనాలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ వైద్య అందుబాటులో ఉండాలని సంకల్పించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు విడదల రజిని తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మకంగా నడుస్తుందని, ఏప్రిల్ మొదటి వారంలో సీఎం అధికారికంగా ప్రారంభిస్తారని విడదల రజిని వెల్లడించారు.
ఇందులో 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారని, 67 రకాల మందులు ఇస్తారని, రానున్న కాలంలో 105 రకాల మందులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని విడదల రజని పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు విడదల రజిని. ఎమ్మెల్యేలను కొనడం, వెన్నుపోటు పడడం టిడిపి అధినేత చంద్రబాబుకు అలవాటేనని మంత్రి విడదల రజిని విమర్శించారు. ఇక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి విడదల రజిని ఉండవల్లి శ్రీదేవికి సీఎం వైయస్ జగన్ సముచిత స్థానం ఇచ్చినా ఆమె వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. శ్రీదేవి తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications