సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా - విజయవాడ నడిబొడ్డున : టార్గెట్ ఫిక్స్ ..!!
ఏపీ ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా భారీ ప్రాజెక్టు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు బాధ్యతలను కేబినెట్ సబ్ కమిటీతో పాటుగా అధికారుల నుంచి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మీ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లతో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల నుంచి శ్రీలక్ష్మి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు పనుల పరిశీలన చేస్తున్నారు. తాజాగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన శ్రీలక్ష్మి జరుగుతున్న పనులను వివరించారు. అంబేద్కర్ విగ్రహ భాగాలన్నీ సిద్దం అయ్యాయని చెప్పారు. మొత్తం 13 భాగాలుగా విగ్రహం ఉందని..జాగ్రత్తగా అన్ని కలిపి నిర్మాణం చేయాల్సి ఉందని వెల్లడించారు.
అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంతో పాటు సుందరీకరణ పనులు, లైబ్రరరీ, కన్వెన్షన్ హాల్, స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతివనం, విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని శ్రీలక్ష్మి వివరించారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం జగన్ ఈ ప్రాజెక్టు పురోగతి పైన సమీక్ష నిర్వహించారు. 70 అడుగుల పేడస్టల్ నిర్మాణంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహానికి సంబంధించి షూ భాగాలను ఏర్పాటు చేస్తున్నామని దశల వారీగా భాగాల వారీగా విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు.

ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చి దిద్దుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. భూమి నుండి విగ్రహం ఎత్తు మొత్తం 205 అడుగులు ఉండనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు అందిస్తున్నారని మంత్రులు చెప్పుకొచ్చారు అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి పరిశీలించివచ్చామని మంత్రులు వివరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆంధ్రుల అందరికీ గర్వకారణమని ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక గౌరవం దక్కుతుందన్నారు.












Click it and Unblock the Notifications