అసెంబ్లీలో గొడవ: జగన్ను ఏకిపారేసిన మంత్రులు
హైదరాబాద్: హత్యారాజకీయాలపై తక్షణమే చర్చ జరపాలంటూ పట్టుబట్టి సభా కార్యక్రమాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఏకిపారేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్కు పట్టడం లేదని ఆయన అన్నారు. వైసిపి లాంటి ప్రతిపక్షాన్ని ఏపి చరిత్రలో చూడలేదని ఆయన అన్నారు.
పది శాతం కమిషన్ అనేది జగన్కు అలవాటుగా మారిందని, అందుకే లక్ష కోట్ల విషయంలో పది శాతం కమిషన్ ఇస్తానని అన్నారని ఆయన చెప్పారు. లక్ష కోట్ల వ్యవహారంపై జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. హత్యలపై వైసిపి రోజుకో సంఖ్య చెబుతోందని ఆయన అన్నారు.
ఇడుపులపాయ రాజకీయాలను సాగనివ్వమని మరో మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ఇడుపులపాయ రాజకీయాలను అసెంబ్లీ వరకు తేవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆశించినట్లుగా సభ నడవదని ఆయన అన్నారు.
శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. వైసిపి సభ్యుల్లో సగం మంది జైలుకు వెళ్లి వచ్చినవారేనని ఆయన అన్నారు. సభా నియమాలు తెలుసుకోకుండా అసెంబ్లీని పులివెందుల, ఇడుపులపాయలా మార్చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వైసిపిసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ను కోరారు.