హీటెక్కించిన మిస్ వైజాగ్ 2017 పోటీలు.. ఒకవైపు ఆందోళన, మరోవైపు అందాల ప్రదర్శన!
విశాఖపట్నం: మిస్ వైజాగ్ 2017 పోటీలు తీవ్ర ఆందోళన, ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. మహిళా సంఘాలు నిరసనలను లెక్కచేయకుండా నిర్వాహకులు ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కరుణ పూజిత మిస్ వైజాగ్ కిరీటం కైవసం చేసుకుంది.
మిస్ వైజాగ్ ఫైనల్స్లో అందాల రాణి కిరీటం కోసం 23 మంది యువతులు పోటీ పడ్డారు. ట్రేడిషనల్ , పార్టీవేర్, ఎత్నీక్ వేర్ దుస్తులలో అమ్మాయిలు ర్యాంప్పై హొయలొలుకుతూ క్యాట్ వాక్ చేసి అందరినీ అలరించారు.
కరుణ పూజితకు మిస్ వైజాగ్ కిరీటం దక్కగా.. ఫస్ట్ రన్నరప్గా రోజిలిని, సెకండ్ రన్నరప్గా లక్కీ నిలిచారు. మిస్ ఫొటో జెనిక్గా జ్యోత్స్న, మిస్ వైజాగ్ సెల్ఫీగా ప్రవళిక, మిస్ బ్యూటీఫుల్ ఐస్గా ప్రణీత, మిస్ హెల్తీ స్కిన్గా విజయదుర్గ, మిస్ బ్యూటీపుల్ హెయిర్గా తనూజ, బ్యూటీపుల్ స్మైలీగా ప్రీతి, మిస్ ట్రెడిషినల్గా కమలా పుజిత , బ్యాటీ ఫర్ కాజ్గా నిర్మల నిలిచారు.
నిజానికి ఈ మిస్ వైజాగ్ పోటీలను పోస్టర్ ఆవిష్కరణ రోజునుంచే రద్దు చేయాలంటూ విశాఖలోని మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఆడిషన్స్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అప్పట్లో పోలీసులు మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
ఈ అందాల పోటీలకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం నుంచీ మహిళా సంఘాలు తమ నిరసనలను వ్యక్తం చేశాయి. పోటీలను అడ్డుకునేందుకు చివరికి వరకూ ప్రయత్నించాయి. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళా సంఘాల నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అందాల పోటీలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
మిస్ వైజాగ్ 2017 పోటీలను తిలకించేందుకు చాలామంది కుటుంబ సమేతంగా తరలివచ్చారు. పోటీల్లో ఎక్కడా అశ్లీలత లేదంటూ పలువురు ప్రశంసించారు. అందాల పోటీల్లో అందం ఒక్కటే ప్రధానాంశం కాదని, మహిళల మేధస్సును కూడా పరీక్షిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు.