28న ఏపీ కేబినెట్ భేటీ- ప్రస్తుత మంత్రులకు చివరి సమావేశమా..!!? ప్రోగ్రస్ రిపోర్టులు - మిషన్ 2024..!!
ఏపీలో వేడి పుట్టిస్తున్న రాజకీయాల నడుమ ఈ నెల 28న ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్న సమయంలో ఈ సమావేశం లో కీలక నిర్ణయాలు జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశమనే చర్చ పార్టీలో మొదలైంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం 2019 జూన్ 8న కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పుడే ముఖ్యమంత్రి జగన్ ఆ కేబినెట్ లోని మంత్రులు రెండున్నారేళ్లు మాత్రమే మంత్రులుగా ఉంటారని.. 90 శాతం వరకు మార్పులు జరుగుతాయని స్పష్టం చేసారు.

జగన్ మార్క్ డెసిషన్స్ పై ఉత్కంఠ
అయితే, మొత్తం కేబినెట్ నే మార్చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయానికి వచ్చారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అందునా.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలో మరింత అగ్రెసివ్ గా ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి కేబినెట్ సమావేశంలోనే కేబినెట్ ప్రక్షాళన..పార్టీ బాధ్యతలు... 2024 ఎలక్షన్ మిషన్.. ప్రస్తుతం ప్రజలతో మమేకం పైనా సీఎం దిశా నిర్దేశం చేసేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం.

ఇక మిషన్ 2024 అమలు దిశగా
ఇప్పటికే సీఎం జగన్ మొత్తం మంత్రులు..ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రభుత్వ నిఘా అధికారులతో పాటుగా ప్రయివేటు సర్వే సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ప్రతీ మంత్రి తమ శాఖలతో పాటుగా నియోజకవర్గం - జిల్లా పైన ఎటువంటి ప్రభావం చూపించారనే అంశాల ఆధారంగా ఈ సర్వే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక, కేబినెట్ ప్రక్షాళన..సీనియర్లకు పార్టీ బాధ్యతలతో పాటుగా... తాను ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండాతో పాటుగా రాజకీయం గా జరిగే చర్చల్లో సీఎం వీటి పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయటమే..
కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే రానున్న సార్వత్రిక ఎన్నికలు సమాయత్తం కావటం పైన సూచనలు చేసారు. వచ్చే ఏడాది నుంచే ప్రశాంత్ కిషోర్ టీం వైసీపీ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగుతుందని సీఎం స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు పార్టీ - ప్రభుత్వం పరంగా తీసుకోనున్న నిర్ణయాలను వెల్లడించటం..అదే విధంగా వాటిని పూర్తి చేయటం పైన సీఎం కసరత్తు చేయనున్నట్లు సమాచారం. నవంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పష్టత
ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని విమర్శలకు..తాము చేస్తున్న కార్యక్రమాల గురించి అసెంబ్లీ వేదికగా సమాధానం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఇదే అంశాన్ని మంత్రులకు సైతం వివరించి.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ ప్రక్షాళనకు సీఎం వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా 2024 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటికే నుంచే కార్యాచరణ అమలు కు సీఎం సిద్దం అవుతున్నారు. దీంతో..ఇప్పుడు అధికార పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా ప్రస్తుత మంత్రులకు సీఎం ఎటువంటి షాకింగ్ న్యూస్ చెబుతారు..అదే విధంగా భవిష్యత్ కార్యాచరణ పైన ఏటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఈ కేబినెట్ సమావేవంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో కీలక పరిణామాలకు అవకాశం
అదే విధంగా అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక..వచ్చే నెల ఏడు లేదా ఎనిమిది తేదీల్లో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తయిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు..ఆ తరువాత ఇక నిర్ణయించిన కార్యాచరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో..ఇక, ఈ కేబినెట్ సమావేశంతోనే ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications