వంద కేసులో పెట్టినా బెదరను: వైసిపి ఎంపి మిథున్ రెడ్డి
నెల్లూరు: ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు తమపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు బనాయించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో శుక్రవారం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తమపై వంద కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
అధికారం ఉందని ప్రభుత్వం విర్రవీగుతోందని ఆయన అన్నారు. ప్రజల తరఫున తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు. టిడిపి నేతలు మహిళా తాహిశీల్దార్ను పట్టుకుని కొడితే అడిగే పరిస్థఇతి లేదని ఆయన వనజాక్షిపై దాడి ఘటనను ఉద్దేశించి అన్నారు.
తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్పై దాడి ఛేశారనే ఆరోపణపై మిథున్ రెడ్డిని, పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జీ బియయ్పు మధుసూదన్ రెడ్డిని ఈ నెల 17వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారంనాడు వారికి తిరుపతి అదనపు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.