జలీల్ఖాన్ నమ్మకద్రోహి: 'టీడీపీలో చేరడంతో పార్టీకి గ్రహణం వీడింది'
విజయవాడ: వైసీపీ తరుపు నుంచి గెలిచి టీడీపీలో చేరడాన్ని కొందరు వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నమ్మకద్రోహి అంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
జలీల్ఖాన్ వైసీపీని వీడటం వల్ల పార్టీకి గ్రహణం వీడిందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.... విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకుల సమావేశం వన్టౌన్లోని మాఇల్లు ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ పార్టీ ఫ్లోర్లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని, కార్యకర్తలను మోసం చేసి జలీల్ఖాన్ టీడీపీలో చేరటం దుర్మార్గమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామా దేవరాజు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ కష్టపడి జలీల్ఖాన్ను గెలిపించుకుంటే ఈ విధమైన వెన్నుపోటు పోడవటం దారుణమన్నారు.

మరోవైపు జలీల్ఖాన్ వైసీపీ నాయకుల రక్తాన్ని పీల్చిపిప్పి చేసి గెలిచారని 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ అన్నారు. కేవలం తనకు ముడుపు లు ఇచ్చే వారిని పక్కన పెట్టుకొని మంతనాలు చేశారే తప్ప కార్యకర్తలకు ఎప్పు డూ అండగా లేరన్నారు. జలీల్ ఖాన్ వెళ్లిపోవడంతో పార్టీ మరింత పటిష్టమైందన్నారు.
జలీల్ఖాన్ పార్టీలో ఉండి ఇక్కడి ప్రజలకు కానీ, కార్యకర్తలకు గానీ చేసిందేమి లేదని 40వ డివిజన్ కార్పొరేటర్ ఆసీఫ్ అన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా తనకు ఓట్లు వేసిన ప్రజలకు ఏమి చేయలేదని జలీల్ఖానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఆయన గురించి మాట్లాడుకోవడం వృథా అన్నారు.
ఇదిలా ఉంటే మార్చి 6న జరిగే నియోజకవర్గ సమావేశాన్ని జయప్రదం చేయాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి 36వ డివిజన్ పార్టీ కన్వీనర్ గౌస్మొహిద్దీన్ అధ్యక్షత వహించగా కార్పొరేటర్లు జమల పూర్ణమ్మ, సంధ్యారాణి, బీజాన్బీ, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత బూదాల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications