రేవంత్ రెడ్డికి గొంతు నొప్పి, ఒంటి నొప్పులు: మీడియాను చూసి అరుపులు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారుల నుంచి ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కుంటున్న నోటుకు ఓటు కేసు నిందితుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గొంత నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది సుధీర్ కుమార్ చెప్పారు. రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు దర్యాప్తు తర్వాత సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఆరోగ్యం దెబ్బ తిన్నదని ఆయన చెప్పారు. కలుషితమైన నీరు తాగడం వల్ల గొంత నొప్పి వచ్చిందని, జ్వరం కూడా ఉందని ఆయన చెప్పారు. స్పెషల్ కెటగిరీ రిమాండ్ ఖైదీకి ఇచ్చే కనీస సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. సిట్లో కాకుండా సౌకర్యాలున్న కార్యాలయంలో నిందితులను ఉంచాలని ఎసిబిని కోరినట్లు తెలిపారు.
ఇదిలావుంటే, ఆదివారం ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఎసిబి కేంద్ర కార్యాలయానికి తీసుకుని వచ్చే సమయంలో రేవంత్ రెడ్డి మీడియానూ చూస్తూ ఈ కొడుకులు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు అని పెద్దగా అరిచారు.

జైలులో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కనీస సౌకర్యాలు కల్పించలేదని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం వారు ఎసిబి డిజి ఖాన్ నివాసానికి వెళ్ళి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కూడా తుంగలో తొక్కుతూ సురక్షిత మంచినీరు కూడా ఇవ్వడం లేదని, నిద్రించడానికి కనీస వసతులు కల్పించలేదని, డాక్టర్లు సూచించిన మందులను కూడా వేసుకోనివ్వడం లేదని ఆరోపించారు. రేవంత్రెడ్డితో పాటు బిషప్ హ్యారి సెబాస్టియన్, రుద్రసింహలను మానసికంగా, శారీరకంగా క్షోభకు గురి చేస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఎసిబి కస్టడీకి అనుమతించిందని, ‘సిట్' కస్టడీకి అనుమతించలేదని వారు తెలిపారు. మానవ హక్కులను, రాజ్యాంగ స్ఫూర్తిని సంరక్షించాలని వారు డిజిని కోరారు.












Click it and Unblock the Notifications