రంగంలోకి బొత్స: చక్రపాణిరెడ్డి డిమాండ్ ఇదే, చివరివరకు భూమా ఇలా....
నంద్యాల ఉప ఎన్నికలు అధికార టిడిపికి చిక్కులు తెచ్చి.పెడుతున్నాయి. ఈ ఎన్నికలను ఆసరాగా చేసుకొని అసంతృప్తులు తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు అధికార టిడిపికి చిక్కులు తెచ్చి.పెడుతున్నాయి. ఈ ఎన్నికలను ఆసరాగా చేసుకొని అసంతృప్తులు తమ కోర్కెల చిట్టాను విప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ స్థానం తనకే ఇస్తానని హమీ ఇస్తేనే తాను పార్టీలో కొనసాగుతానని లేకపోతే పార్టీని వీడుతానని శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపి నేతలకు తేల్చి చెప్పారు. ఈ విషయమై టిడిపి నాయకత్వం ఏం చెబుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 23వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈ స్థానం నుండి మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆయన సోదరుడు టిడిపి ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డిని సోమవారంనాడు ఈ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు.
అయితే భేటీతో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. మోహన్రెడ్డిని పార్టీ మారకుండా చక్రపాణిరెడ్డి చివరివరకు ప్రయత్నాలు చేశారు. కానీ, సాధ్యం కాలేదు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో చంద్రబాబు తాత్సార వైఖరిని నిరసిస్తూ మోహన్రెడ్డి పార్టీని వీడారు.
మోహన్రెడ్డి పార్టీ మారిన తర్వాత పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర విషయాల్లో కూడ చక్రపాణిరెడ్డికి టిడిపి నాయకత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పైగా ఇంతవరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన చక్రపాణిరెడ్డి స్థానంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. శాసనమండలి ఛైర్మెన్ పదవి విషయంలో కూడ పార్టీ నాయకత్వం నుండి స్పష్టమైన హమీ దక్కలేదు.దీంతో ఆయన కూడ వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
2019 శ్రీశైలం టిక్కెట్టు ఇస్తేనే పార్టీలో ఉంటా
2019 ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి తనకు టిక్కెట్టు ఇస్తేనే పార్టీలో ఉంటానని టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ నాయకత్వానికి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారని సమాచాం. శిల్పా మోహన్రెడ్డి పార్టీ సోమవారం నాడు చక్రపాణిరెడ్డిని కలిసిన తర్వాత మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎంపి సిఎం రమేష్లు చక్రపాణిరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీని వీడకూడదని వారు చక్రపాణిరెడ్డికి సూచించారు. అయితే 2019 ఎన్నికల్లో శ్రీశైలం టిక్కెట్టు ఇస్తానని పార్టీ నాయకత్వం స్పష్టమైన హమీ ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టారు. ఈ విషయాన్ని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళారు నేతలు.
Recommended Video
రంగంలోకి బొత్స, రవీంధ్రనాథ్రెడ్డి
మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎంపి సిఎం రమేష్ లు చర్చించిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రవీంధ్రనాథ్రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణలు మరోసారి చక్రపాణిరెడ్డితో చర్చించారు.వైసీపీలో చేరాలని వారు చక్రపాణిరెడ్డిని కోరారు. అయితే టిడిపిలో చక్రపాణిరెడ్డిని అవమానాలకు గురిచేస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు చక్రపాణిరెడ్డికి గుర్తుచేశారు.అయితే ఈ నెల 3వ, తేదిన నంద్యాలలో జరిగే జగన్ ర్యాలీ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డిని వైసీపీలో చేర్చుకొనే ప్రయత్నం సాగుతోంది. ఈ మేరకు వైసీపీ నేతలు వ్యూహలను రచిస్తున్నారు.
వైసీపీలో ఉన్నా శ్రీశైలం టిక్కెట్టు
తొలుత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ ఏర్పాటైన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరారు. అయితే 2011లో ఆయన వైసీపీని వీడారు. శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి శిల్పా చక్రపాణిరెడ్డి టిక్కెట్టును ఆశించారు. కానీ, ఈ స్థానం నుండి పోటీచేసేందుకు వైసీపీ టిక్కెట్టును ఇచ్చేందుకు ఆసక్తిని చూపలేదు. దీంతో వైసీపీ నుండి శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు దక్కదనే కారణంగా ఆయన ఆ పార్టీ నుండి 2011లో టిడిపిలో చేరారు. ఇప్పటివరకు టిడిపిలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో శ్రీశైలం నుండి ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు.
శిల్పా గెలుపుకు భూమా .. అయినా
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించేందుకు భూమా నాగిరెడ్డి కృషి చేశారు. తన అనుచరులందరిని బాబు వద్దరకు తీసుకెళ్ళి శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించేందుకు కృషిచేస్తామని మాటిచ్చారు. బాబును కలిసి వచ్చిన మరునాడే భూమా గుండెపోటుతో మరణించాడు. అయితే ఈ విషయాలను టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుండే ఎన్నికల హడావుడి మొదలైన పార్టీ నాయకత్వం తనను అవమానాలకు గురిచేసింది. కనీసం తనను ప్రచారంలో ఇన్వాల్వ్ కూడ చేయని విషయాన్ని చక్రపాణిరెడ్డి సిఎం రమేష్, మంత్రి కాలువ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించారు. పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తన అనుచరులతో, ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకొంటానని ఆయన టిడిపి నేతలకు చెప్పారు.