సీఎం జగన్కు బాలాపూర్ లడ్డూను కానుకగా ఇచ్చిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్...
చెప్పినట్లుగానే హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను సీఎం వైఎస్ జగన్కు కానుకగా అందించారు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్.కుటుంబ సభ్యులు అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి మంగళవారం(సెప్టెంబర్ 21) ఆయన సీఎం జగన్ను కలిశారు. లడ్డూని జగన్కు కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. రమేశ్ యాదవ్ అభిమానానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ను కలిసి లడ్డూను అందజేయడంపై రమేశ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం బాలాపూర్ లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన వేలంపా టలో మర్రి శశాంక్ రెడ్డితో కలిసి రూ.18లక్షల 90వేలకు లడ్డూను దక్కించుకున్నారు.ఆ సందర్భంగా రమేశ్ యాదవ్ మాట్లాడుతూ... లడ్డూను ఏపీ సీఎం జగన్కు కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.చెప్పినట్లుగానే ఇవాళ తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి లడ్డూను జగన్కు అందజేశారు.
బాలాపూర్ లడ్డూ విశిష్ఠత :
వినాయకుడి ప్రసాదాన్ని భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు.వేలం పాటలో లడ్డూని దక్కించుకుంటే తమకు అన్ని విధాలా కలిసొస్తుందని నమ్ముతారు.కొంతమంది రైతులు ఆ లడ్డూని తమ పొలాల్లోనూ చల్లుతారంటే అతిశయోక్తి కాదు. వినాయకుడి లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు పోటీ పడుతారు. లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు.అందులోనూ బాలాపూర్ లడ్డూకి మరింత విశిష్ఠత ఉన్నది.
21 కిలోల బరువు ఉండే బాలాపూర్ లడ్డూ కోసం చాలామంది ప్రముఖులు పోటీ పడుతుంటారు. 1980 నుంచి బాలాపూర్ గణేశ్ను ఏర్పాటు చేస్తున్నారు. 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలి ఏడాది కొలను మోహన్ రెడ్డి.. 450 రూపాయలకు వేలంలో కొనుగోలు చేశారు. 1995లోను ఆయనే రెండోసారి రూ.4500కు లడ్డూను దక్కించుకున్నారు. కొలను కృష్ణారెడ్డి 1996లో రూ.18వేలకు, 97లో రూ.28 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 1998లో మరోసారి లడ్డూ కొలను మోహన్రెడ్డికి దక్కింది. ఆ సంవత్సరం వేలంలో రూ.51వేల ధర పలికింది. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి రూ.65వేలకు, 2000లో కల్లెం అంజిరెడ్డి రూ.66వేలకు, 2001లో రఘునందన్ చారి రూ.85వేలకు లడ్డూను దక్కించున్నారు.2019లో బాలాపూర్ లడ్డూ వేలం పాటలో 17లక్షల 60వేల రూపాయలకు కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఏపీ రమేశ్ యాదవ్ రూ.18లక్షల 90వేలకు ఇటీవలి వేలంలో లడ్డూను దక్కించుకున్నారు.