విశాఖ ప్రజలను మోడీ మెచ్చుకున్నారు: వెంకయ్య
న్యూఢిల్లీ: హుధుద్ తుఫాను విశాఖపట్నం నగరాన్ని పూర్తిగా దెబ్బ తీసిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హుధూద్ తుఫాను నష్టాన్ని ఎదుర్కునేందుకు అందరూపు ముందుకు రావాలని ఆయన బుధవారం మీడియా సమావేశంలో కోరారు. తుఫాను తాకిడికి గురైన విశాఖ ప్రజలు చూపిన ధైర్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్లు ఆయన తెలిపారు.
హుధుద్ తుఫానుపై ప్రధాని తక్షణమే స్పందించి వేయి కోట్ల రూపాయలు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. తుఫాన్లను ఎదుర్కునేందుకు వీలుగా భవన నిర్మాణంలో మార్పులు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హుధుద్ తుఫానుతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రధాని మోడీ మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన విషయం తెలిసిందే.
విశాఖకు త్వరలోనే కేంద్ర బృందాలు వస్తాయని వెంకయ్య నాయుడు చెప్పారు. విభజన నష్టాన్ని పూరించకోక ముందే విపత్తు రావడం బాధాకరమని ఆయన అన్నారు. విశాఖకు ఏదైనా మేలు చేయాలని ప్రధాని మోడీ చెప్పారని, స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ ఉన్నందున త్వరగా నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారని ఆయన చెప్పారు.
మురికివాడల్లో బాబు పర్యటన
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం నగరంలోని పలు మురికవాడల్లో బుధవారం పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. సకాలంలో నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.