ఏప్రిల్ తర్వాత ఏపీ అసెంబ్లీ రద్దు ? జగన్ కు మోడీ-షా గ్రీన్ సిగ్నల్ ? ముందస్తుపై జోరుగా చర్చ!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. మరో ఏడాది తర్వాత ఎన్నికలు ఖాయం. అయితే రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందన్న ప్రచారం మరోసారి విస్తృతంగా సాగుతోంది. దీనికి కారణం సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్ లో కేంద్రంలో పెద్దలతో జరిపారని చెబుతున్న మంతనాలే. దీంతో రాష్ట్రంలో ముందస్తుకు ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. దీనిపై వైసీపీ పెద్దలు త్వరలో క్లారిటీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఏపీలో ముందస్తు కూత
ఏపీలో ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు విపక్షాలకు సంకేతాలు అందుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ఆరునెలలో, ఏడాది ముందో చేపట్టాల్సిన రాజకీయ కార్యక్రమాల్ని, చర్చల్ని సీఎం జగన్ ముందుగానే కొనసాగిస్తుండటమే. దీంతో విపక్షాలకు సైతం దీనిపై క్లారిటీ వచ్చేస్తోంది. అలాగే ముందస్తుపై జరుగుతున్న చర్చను వైసీపీ నేతలు గతంలోనే తోసిపుచ్చినప్పటికీ రాష్ట్రంలో, ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలు వచ్చేస్తున్నాయి.
ముందస్తుకు మోడీ-షా గ్రీన్ సిగ్నల్?
సీఎం వైఎస్ జగన్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ టూర్ లో ముందుగా ప్రధాని మోడీని, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఏపీ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి, ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
దీంతో అసెంబ్లీ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మోడీ-షా ద్వయం జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలను సమయం చూసి బయటపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ తర్వాత అసెంబ్లీ రద్దు?
వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏపీ అసెంబ్లీ రద్దు చేసేందుకు సీఎం జగన్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం మద్దతు లేకుండా అసెంబ్లీ రద్దు చేస్తే ఇబ్బందులు తప్పవు. కానీ ఇప్పుడు కేంద్రంలో పెద్దల సహకారం ఉండటంతో వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత ఏప్రిల్ లో లేదా మేలో అసెంబ్లీ రద్దుకు జగన్ మొగ్గు చూపకపోవచ్చని తెలుస్తోంది.
ఇందుకోసం బడ్డెట్ లోనూ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని, ముఖ్యంగా కొత్త సంక్షేమ పథకాల్ని తెరపైకి తెస్తారని ప్రచారం జరుగుతోంది. వీటి సాయంతో మరోసారి అధికారమిస్తే దేశ చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా జరగనంత సంక్షేమం అందిస్తామని భారీ హామీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికల ప్లాన్ ఇదే?
వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత ముందస్తు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ముంది. అంటే దాదాపు ఆరు నెలలు ముందు ముందస్తు ఎన్నికలు ఉండేలా చూసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కు సైతం క్లారిటీ రావడంతో వారు వచ్చే ఏడాది మొత్తం జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈలెక్కన వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించి కొత్త ఏడాదిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. తద్వారా నానాటికీ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కాస్తయినా అధిగమించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.