మోహన్ బాబు, ఆయన కుమారులకు ఏపీ హైకోర్టులో ఊరట
అమరావతి: ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్లకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారనే అభియోగాలపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జూన్ 28న మోహన్ బాబు.. తన కుమామరులతో కలిసి తిరుపతి కోర్టులో విచారణకు హాజరయ్యారు.
వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా, 2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదని మోహన్ బాబు తన కుమారులతో కలిసి తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
అయితే, అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కోడ్ ఉల్లంఘన కింద మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వీ సతీష్పై కేసు నమోదైంది. రోడ్డుపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా, విచారణ 8 వారాలు నిలుపుదల చేయడం మోహన్ బాబు ఫ్యామిలీకి కాస్త ఊరటగా చెప్పవచ్చు.