పవన్పై తర్వాత, సంచలనం చెబుతా: మోహన్ బాబు
హైదరాబాద్: తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై తర్వాత స్పందిస్తానని ప్రముఖ తెలుగు సినీ మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం తన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు.
ఆలయ డిప్యూటీ ఈవో చిన్నమగారి రమణ శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తాను నటించిన 'రౌడీ' సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు మోహన్బాబు చెప్పారు.
పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేనపై మీ స్పందన ఏమిటని అడిగితే, ఇది రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదని, అందువల్ల పవన్ పార్టీపై తర్వాత స్పందిస్తానని మోహన్ బాబు సమాధానం చెప్పకుండా దాటవేశారు.
మోహన్ బాబుకు రాజకీయాసక్తి ఉన్నప్పటికీ ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
దేశం బాగు యువత చేతుల్లోనే ఉందని మోహన్ బాబు చెప్పారు. త్వరలో సంచలనాత్మక నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నారు. డబ్బులు, సారా ప్యాకెట్లకు అమ్ముడు పోకుండా ఓటు వేయాలన్నారు. ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఓటేయాలన్నారు.