మోహన్ బాబు ఆగిపోయారు, టచ్లో బొత్స: కిషన్
హైదరాబాద్: కొన్ని కారణాల వల్ల సినీ నటుడు మోహన్ బాబు తమ పార్టీలోకి రాకుండా ఆగిపోయారని బిజెపి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ పార్టీ బలంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇరు ప్రాంతాల్లో తమ పార్టీ బలమేమిటో, తెలుగుదేశం పార్టీ బలమేమిటో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు తెలంగాణలోని మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి తాము రెండు సీట్లు గెలుచుకున్నామని ఆయన గుర్తు చేశారు.
ఓ వైపు పొత్తు అంటూనే మరో వైపు తమ పార్టీని విమర్శించడం చంద్రబాబుకు సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు. నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. పొత్తుల విషయం టిడిపి కోర్టులోనే ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ బిజెపిగా తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశామని, ముఖ్యమంత్రి అభ్యర్థిని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు, బిజెపికి మధ్యనే పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, తాను బిజెపిలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను బొత్స సత్యనారాయణ ఖండించారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని ఆయన అన్నారు.