బాలయ్య చెప్పుడు మాటలు వినరు, నటి చెప్పినా ఎన్టీఆర్ నమ్మలేదు: మోహన్ బాబు
అనంతపురం: బాలకృష్ణ చెప్పుడు మాటలు వినేవారు కాదని ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు అన్నారు. కొద్ది నెలల క్రితం తన కాలేజీ ముందు బాలయ్య అభిమానులు ఫ్లెక్సీలను పెడితే ఎవరో తీసేశారనీ, దానిపై కొందరు చెప్పుడు మాటలు బాలకృష్ణ వరకూ తీసుకెళ్లారని ఆయన అన్నారు.
అయినా బాలయ్య ఏమాత్రం తనకు ఫోన్ చేయలేదని, ఇదేమిటని అడగలేదని మోహన్ బాబు తెలిపారు. ఫోన్ చేయాలని అనుకుంటుండగానే తర్వాతి రోజు బాలయ్యే కళాశాలకు వచ్చారనీ, ‘ఫోటో మీరు తీసేయించి ఉండరు. ఎవరో కావాలనే మీపై నాకు ఫిర్యాదు చేశారు. అదేం పట్టించుకోకండి' అని తనతో అన్నారన్నారు.
బాలయ్యను తాను పొగడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. రెండు నెలలు నటిస్తే కొన్ని కోట్ల డబ్బు వస్తుందనీ, అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం డబ్బును లెక్క చేయని వ్యక్తి బాలకృష్ణ అని చెప్పారు. లేపాక్షి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన బాలకృష్ణకు, ఆయన అభిమానులకు అభినందనలు తెలిపారు.
రాయలసీమ కోసం జోలె పట్టిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎంతో పాటుపడ్డారని చెప్పారు. ‘ఏక గర్భమున జన్మించకపోయిన మనమిద్దరం అన్నదమ్ములమేనని' ఆనాడు ఎన్టీఆర్ తనతో అన్నారని మోహన్బాబు వ్యాఖ్యానించారు.
అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ను అవమానించబోయారనీ, తాను ఒక్కడినే ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశానన్నారు. ఓ నటి వెళ్లి తన గురించి చెప్పుడు మాటలు చెప్పినా ఎన్టీఆర్ పట్టించుకోలేదని మోహన్ బాబు అన్నారు.