20న అతనిపై సంచలన వ్యాఖ్యలు చేస్తా: మోహన్బాబు
ఆ వ్యక్తి ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడు, మంత్రి పదవుల్లో ఉండి అక్రమంగా ఎంత సంపాదించారో బయటపెడతానని తెలిపారు. ఈ నెల 20న ఆ వివరాలతో బయటకు వస్తానన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులిచ్చే నోటుకు ఆశపడి వారికి ఓటెయొద్దని ఆయన ఓటర్లను కోరారు. ఏ పార్టీకి ఓటేసినా ఫర్వాలేదన్నారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై తర్వాత స్పందిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేనపై మీ స్పందన ఏమిటని అడిగితే, ఇది రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదని, అందువల్ల పవన్ పార్టీపై తర్వాత స్పందిస్తానని మోహన్ బాబు సమాధానం చెప్పకుండా దాటవేశారు.
దేశం బాగు యువత చేతుల్లోనే ఉందని మోహన్ బాబు చెప్పారు. త్వరలో సంచలనాత్మక నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నారు. డబ్బులు, సారా ప్యాకెట్లకు అమ్ముడు పోకుండా ఓటు వేయాలన్నారు. ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఓటేయాలన్నారు. శ్రీకాళహస్తి నుండి పోటీ చేస్తారా అని అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేశారు. అనంతరం మాట్లాడిన మంచు విష్ణును పవన్ పెట్టిన జనసేన పార్టీపై అభిప్రాయం కోరగా ఆల్ ది బెస్ట్ అన్నారు.