సీపీఎస్ రద్దు చేసిన పంజాబ్-జగన్ సర్కార్ పై మరింత ఒత్తిడి-ఇప్పటికే ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, జార్ఖండ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినా.. ఇప్పుడు నాలుగేళ్లు కావస్తున్నా ఇది అమలుకాలేదు. దీంతో ఉద్యోగులు తమ పోరు ముమ్మరం చేస్తున్నారు. అయితే పోలీసులతో వారిని అణచివేస్తున్న వైసీపీ సర్కార్ కు పంజాబ్ లో ఆప్ సర్కార్ మరో షాకిచ్చింది.

సీపీఎస్ రద్దు వ్యవహారం
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే దీన్ని ఎత్తేస్తే ఆ భారాన్ని తాము మోయాల్సి ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని రాజకీయ పార్టీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల్లో హామీ ఇవ్వకపోయినా ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేశాయి. దీంతో ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.

నెరవేరని జగన్ హామీ
వైఎస్ జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో అధికారమిస్తే వారం రోజుల్లోనే ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము దీని లోతు తెలియక హామీ ఇచ్చేస్తామని గతంలోనే చెప్పేసింది. అయినా ఉద్యోగులు మాత్రం పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు జీపీఎస్ పేరుతో మరో పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వారు ఒప్పుకోలేదు. తమకు పాత పెన్షన్ పథకం మాత్రమే వర్తింపజేయాలని పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.

సీపీఎస్ రద్దు చేసేసిన పంజాబ్
ఓవైపు ఏపీ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆందోళన పడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ పంటి రాష్ట్రాల్లో సీపీఎస్ ను ప్రభుత్వాలు ఇప్పటికే రద్దు చేశాయి. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాట పట్టింది. ఉద్యోగుల కోరిక మేరకు సీపీఎస్ ను రద్దు చేస్తూ పంజాబ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

జగన్ సర్కార్ పై మరింత ఒత్తిడి?
సీపీఎస్ రద్దుపై ఒక్కో రాష్ట్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దవుతోంది. దీంతో ఏపీలోనూ సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగసంఘాలకు ఇది మరింత ఊపునిస్తోంది. అధే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరగబోతోంది. సీపీఎస్ రద్దు కాకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకేదైనా ప్రత్యామ్నాయానికి మొగ్గు చూపుతుందా, లేక ఉద్యోగుల ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ రద్దుకు సిద్దమవుతుందా అనేది మరికొన్ని నెలల్లో తేలిపోనుంది












Click it and Unblock the Notifications