ఏపీ కరోనా రెడ్ జోన్లలో ఆంక్షలు మరింత కఠినతరం.. మాంసం, చేపల విక్రయాలూ బంద్..
ఏపీలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ఎక్కువగా ఉన్నా నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే రాష్ట్రంలో సగానికి పైగా కేసులు ఉండటంతో ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది. దీంతో ఆయా జిల్లాల్లోని రెడ్ జోన్లలో మాంసాహార అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో దీన్ని అమలు చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించగా.. మిగతా జిల్లాల్లోనూ త్వరలో నిషేధం అమల్లోకి రానుంది.
సగానికి పైగా కేసులు మూడు జిల్లాల్లోనే..
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటేసింది. ఇందులో సగానికి పైగా కేసులు కేవలం మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే సగానికి పైగా కరోనా కేసులున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా రెడ్ జోన్లు ఏర్పాటు చేశారు. వీటిలో స్ధానిక అధికార యంత్రాంగం, మంత్రులు నిరంతరం పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే రెడ్ జోన్ల ఏర్పాటు తర్వాత కూడా వారాంతంలో మాంసాహార మార్కెట్లు తెరవడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని అధికారులు నివేదికలు ఇచ్చారు. దీంతో నెల్లూరు జిల్లాలోని రెడ్ జోన్లలో మాంసాహార మార్కెట్లను కరోనా తగ్గే వరకూ పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు.

మిగతా జిల్లాల్లోనూ మార్కెట్ల మూత..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మాంసాహార మార్కెట్లను పరిమిత వేళల్లో తెరిచి ఉంచుతున్నారు. రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆదివారాలకే వీటిని పరిమితం చేశారు. అయితే రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ఆదివారాల్లోనూ మాంసాహార మార్కెట్లు నడపడం మంచిది కాదని భావిస్తున్న ప్రభుత్వం..వీటిపై పూర్తిస్ధాయిలో నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే భారీగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు రెడ్ జోన్లు ఉన్న నెల్లూరులో అధికారులు మాంసాహార మార్కెట్లు మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. కర్నూలు, గుంటూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ అధికారులు ఇదే దిశగా అడుగులేస్తున్నారు. త్వరలో దీనిపై రాష్ట్ర స్దాయిలో ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications