ప్రమాదంలో 40 భాషలు: ఎపిలోనూ అంతరించిపోయే భాషలు
న్యూఢిల్లీ: భారతదేశంలోని 40కి పైగా భాషలు లేదా మాండలికాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. కొన్ని వేల మంది మాత్రమే ఆ భాషలను మాట్లాడుతున్నారు. దాంతో అవి త్వరలోనే మాయమైపోయే ప్రమాదం ఉంది.
సెన్సస్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం - 22 అధికారికంగా గుర్తింపు పొందిన భాషలను, 100 గుర్తింపు పొందని భాషలను ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఈ భాషలను లక్షకు పైగా మంది మాట్లాడుతున్నారు.
కాగా, 42 భాషలను పది వేలకు తక్కువ మంది మాట్లాడుతున్నారు. ఈ భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, అవి లుప్తమైపోతాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి అంటున్నారు.
భారతదేశంలోని 42 భాషలు లేదా మాండలికలు అంతరించిపోయే దశలో ఉన్నట్లు యునెస్కో ఓ జాబితాను తయారు చేసింది.
అంతరించిపోయే దశలో ఉన్న భాషల్లో అండమాన్ నికోబర్ దీవులకు చెందిన 11 భాషలు ఉన్నాయి. అవి - గ్రేట్ అండమనీస్, జారవ, లామోంగ్సె, లురో, మౌట్, ఓంగే, పు, సానేన్యో, సెంతిలీస్, షోంపేన్, తకహన్యిలంగ్).
మణిపూర్లో అయిమోల్,,అక, కొయిరెన్, లామ్గాంగ్, లాంగ్రోంగ్, పురుమ్, టారావో భాషలు అంతరించే దశలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో నాలుగు భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అవి -బఘతి, హందూరి, పంగ్వలి, సిర్మౌడి.
ఆంధ్రప్రదేశ్లో ఈ భాషలు
ఒడిశాలోని మాండా, పర్జీ, పెంగో భాషలు, కర్ణాటకలోని కొరగ, కురుబబ భాషలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గదబ, నాయకి భాషలు, తమిళనాడులోని కోట, తోడ భాషలు,, అరుణాచల్ ప్రదేశ్లని మ్రా, నా భాషలు, అస్సాంలోని తాయి నోర, తాయి రోంగ్ భాషలు, ఉత్తరాఖండ్ బంగని, జార్ఖండ్లోని బిర్హోర్, మహారాష్ట్రలోని నిహాలి, మేఘాలయలోని రుగా, పశ్చిమ బెంగాల్లోని టోటో భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి.
దేశంలో ప్రమాదంలో పడి అంతరించిపోయే దశలో ఉన్న భాషలను పరిరక్షించి, నిలువ చేసే కార్యక్రమాన్ని మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ చేపట్టింది. పది వేల మందికి తక్కవగా మాట్లాడే భాషల వ్యాకరణ వివరణల, ఏక భాషా ద్విభాషా డిక్షనరీలను, భాషా ప్రైమరీలను, జానపద సంకలనాలను, అన్ని భాషలూ మాండలికాల ఎన్సైక్లోపిడియాను ఈ కార్యక్రమం కింద చేపట్టారు
దేశంలోని 22 గుర్తింపు పొందిన భాషలతో పాటు 31 ఇతర భాషలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అధికార భాషల హోదాను కల్పించాయి.