చంద్రబాబు అరెస్టుపై మోత్కుపల్లి నర్సింహులు సంచలనం: కేసీఆర్ రాజకీయాలు పక్కన పెట్టాలని సూచన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును రాజకీయాలకు అతీతంగా నేతలు ఖండిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పటికీ.. చంద్రబాబు అరెస్టు (chandrababu arrest)ను టీడీపీ మాజీ నేతలు తప్పబడుతున్నారు. తాజాగా, తాజాగా, సీనియర్ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు అరెస్టును ఖండించారు.
శనివారం హైదరాబాద్లో మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత అని అన్నారు. జగన్ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారన్నారు మోత్కుపల్లి.

దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదని.. ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. దళిత డ్రైవర్ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అప్పగించారని మండిపడ్డారు. దళిత మహిళను అత్యాచారం చేసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ కూడా ఇలా ఎప్పుడూ పరిపాలన చేయలేదన్నారు. ప్రజల కోసం ఐదేళ్లలో బడ్జెట్లో రూ.7-8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు అని.. అలాంటి వ్యక్తి, ముష్టి రూ. 300 కోట్లకు ఆశపడతారా? అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి ప్రశ్నించారు.
అంతేగాక, చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. తాను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశానని చెప్పారు. రాజకీయాలు పక్కనపెట్టి కేసీఆర్ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు మోత్కుపల్లి తెలిపారు.
చంద్రబాబు తప్పు చేసే మనిషి కాదు...
— M9.NEWS (@M9Breaking) September 23, 2023
ఆయన అరెస్టుకు నిరసనగా ఆదివారం NTR ghat దగ్గర మోత్కుపల్లి నర్సింహులు ఒక్క రోజు నిరసన దీక్ష#ChandrababuArrest pic.twitter.com/J6KUMl4iF3
రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు మోత్కుపల్లి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్లో నిరసన దీక్ష చేపడతామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తామని మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. కాగా, ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications