ఢిల్లీకి మల్లి బాడీ: గర్వంగా ఉందంటూ సోదరి కంటతడి
న్యూఢిల్లీ: తన సోదరుడు మల్లి మస్తాన్ బాబుకు ఇలా ఆహ్వానం పలకడం చాలా బాధగా ఉందని, కానీ అతనిని చూసి తాము గర్విస్తున్నామని మల్లి సోదరి దొరసానమ్మ శుక్రవారం కంటతడి పెడుతూ చెప్పారు. తన సోదరుడిని తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
మస్తాన్ బాబు భౌతికకాయాన్ని తీసుకొచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. మల్లి మస్తాన్ బాబు ఎన్నో విజయాలు సాధించారని, ఆయన విజయవాల పట్ల మనమంతా గర్వపడాలన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సాయంతో సమన్వయం చేసుకున్నామని ఏపీ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఎయిరిండియా విమానంలో మల్లిమస్తాన్ బాబు భౌతికయాన్ని చెన్నై తరలించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రానికి తరలిస్తారని చెప్పారు. అంత్యక్రియలకు పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
కాగా, పర్వతారోహణలో ప్రాణాలు కోల్పోయిన మల్లి మస్తాన్ బాబు భౌతికకాయం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి భౌతికకాయాన్ని తరలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి చేరుకోనుంది. శనివారం స్వగ్రామం గాంధీజసంగంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని అర్జెంటీనా ప్రభుత్వం ప్రత్యేక విమానంలో పంపించింది. అర్జెంటీనా నుండి గోవాకు వచ్చింది. అక్కడి నుండి ఢిల్లీకి తీసుకు వచ్చారు. ఢిల్లీ నుండి చెన్నై విమానాశ్రయం, అక్కడి నుండి స్వగ్రామానికి రానుంది.