తక్కువ ధరకే: అద్దెకు తీసుకున్న భవంతిపై కన్నేసిన ఎంపీ గల్లా జయదేవ్
అమరావతి: పార్టీ కార్యక్రమాల కోసం గుంటూరులో తాను అద్దెకు తీసుకున్న భవనాన్ని తక్కువ ధరకే కొట్టేయడానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గుంటుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని 300 గజాల్లో మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది.
డబ్బు అవసరమై 2013లో ఆయన ఆ బిల్డింగ్ను ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఆర్ధిక పరిస్థితి దెబ్బతినడంతో నెలవారీ ఈఎంఐలను చెల్లించలేకపోయారు. ఈ క్రమంలో 2014లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాల కోసం ఈ భవంతిని అద్దెకు తీసుకున్నారు.
ఈ క్రమంలో ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేదని తెలుసుకున్న ఎంపీ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనాన్ని వేలానికి వచ్చేలా చేశారని సమాచారం. అంతేకాదు ఆంధ్రా బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 7.5 కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ ఉన్న భవనం ప్రారంభ ధరను రూ. 2.80 కోట్లుగా నిర్ణయిస్తూ బ్యాంకు ఇటీవలే వేలం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో భవనాన్ని వేలంలో దక్కించుకోవాలనుకునే వారు ఈనెల 20, 21 తేదీల్లో సందర్శించుకునే అవకాశాన్ని కల్పించింది.
అయితే ఈ భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని 'అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?' అని బెదిరించడంతో పలువురు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎంపీ అనుచరుల బెదిరింపులకు భయపడిన ఓ స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా, గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్వర్డ్ను చెప్పలేదు.
అంతేకాదు పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు భవన యజమాని తన భవనాన్ని వేలం వేయడాన్ని ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు.
ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సైతం ఖాతరు చేస్తూ శుక్రవారం (జూన్ 24) తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏదైనా భవంతిని వేల వేయాల్సి వచ్చినప్పుడు భవనాన్ని ముందుగా ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ ఇలాంటిదేమీ చేయకుండానే బ్యాంకు అధికారులు భవంతిని వేలం వేసేందుకు సిద్ధమవడం విశేషం.