ఎవడైనా ఆలానే చేస్తాడు: కొడుకుల దాడిపై హర్ష కుమార్
తాను సమైక్యవాదినేనని, ఎపిఎన్జీవోలతో కలసి సమైక్య రాష్ట్రం కోసం రాజమండ్రిలో రోడ్లు తుడిచానని ఆయన గుర్తు చేశారు. కానీ సీమాంధ్రలో ఒక వర్గం బలహీనవర్గాల ఆస్తులే ధ్వంసం లక్ష్యంగా కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. తమ కళాశాలపై దాడి సందర్భంగా జరిగిన సంఘటనలను మీడియా పూర్తిగా ప్రచారం చేయలేదని, కేవలం తన కుమారులకు సంబంధించిన విషయాలను మాత్రమే ప్రచారం చేసిందని ఆరోపించారు.
హర్ష కుమార్ సోమవారం సాయంత్రం ఇటీవల ఎన్జీవోల దాడిలో ధ్వంసమైన తమ కళాశాల బస్సులతోను అనుచరులతోను ఊరేగింపుగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన ఉద్రేకంగా ప్రసంగించారు. తమ కళాశాలను ప్రతిరోజు ఉదయం పది గంటలకు తెరుస్తుండగా ఆ రోజు 7 గంటలకే అక్కడకు వచ్చి ధ్వంసం చేయడం వలనే ఎవరో దాడి చేస్తున్నారని భావించి తన కుమారులు ఎదురు దాడికి దిగారని ఆయన అన్నారు.
తానూ ఎన్జీవో కుటుంబ సభ్యుడునేనని తన తండ్రి ఒక చిన్న ఉద్యోగిగా గతంలో సమ్మెలో పాల్గొన్నప్పుడు తమ కుటుంబ సభ్యులందరూ రోజులు తరబడి ఆకలితో పస్తులున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ తీరు తెన్నులపై ఆయన ధ్వజమెత్తారు. ధనవంతులు, ఉద్యోగస్తుల పిల్లలు చదువుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థలను నిర్వహిస్తూ, మరో పక్క పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను మూయించివేయడం ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు.
తాను, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుగానే పదవులకు రాజీనామా చేశామన్నారు. ఎవ్వరికీ భయపడేది లేదని, మీడియా సహకరించినా, సహకరించకపోయినా ఎవరు అన్యాయం చేయాలనుకున్నా దేవుడే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం ఒక ఎత్తుకాగా ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి వేస్తుందని వ్యాఖ్యానించారు.